పార్టీని పరుగులు పెట్టించాల్సిన పెద్ద నేతలు.. రోజు రోజుకూ వారి మాటలు, చేతలతో దిగజార్చుతుంటే.. తమ తప్పులెరగని ఈ నేతలు ఇప్పుడు జిల్లా అధ్యక్షులపై పడ్డారు. మీ పనితనం బాగాలేదు..మిమ్మల్ని పీకేస్తాం.. పద్దతి మార్చుకోండని హితవు పలుకుతున్నారు. ఇదెట్లా ఉందంటే.. ముఖం బాగాలేక అద్దం పగలగొట్టుకున్నాడట వెనుకటి ఒకడు.
తాజా పరిస్థితులే తీసుకుందాం.. జెన్-జీ ఉద్యమం మొదలైన నాటి నుంచి దీనిపై తలోమాట మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పరిస్థితిని మరింత దిగజార్చేలా చేసుకున్నారు సీనియర్లు. ఈ సీనియర్లకు తోడుగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కూడా మోపైండు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కేటీఆర్ ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తే.. ఇది కాంగ్రెస్, బీఆరెస్ కుమ్మక్కై చేస్తున్న ధర్నా అంటాడు. ఇందిరాపార్క్లో పాల్గొన్న వారంతా యూత్ కాంగ్రెస్ సభ్యులేనంటాడు.
ఇక బండి సంజయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హిందూత్వంపై ఇది దాడి అన్నాడు. దీని వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందన్నాడు. మోడీని ఢీకొట్టలేక బొద్దింకలను ముందుంచాడని ఆరోపించాడు. పేపర్ లీకేజీలు కామన్.. ఏ రాష్ట్రంలో కాలేవు.. అని సమర్థించుకుని విమర్శల పాలయ్యాడు. ధర్మేంద్ర రాజీనామా చేసిన తరువాత మాకు దేశం ముఖ్యం.. ఆ తరువాతే పార్టీ అంటూ నాలుక మడతపెట్టాడు..
ఇలా ఏమాటకు పొంతన లేకుండా.. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ పార్టీని నవ్వుల పాలు చేయడంతో పోటీలు పడుతున్న ఈ నేతలు.. ఇప్పుడు జిల్లా అధ్యక్షులపై పడ్డారు. మీకు మూడిందిరో.. పార్టీ ఇలా తయారు కావడానికి మీరే కారణం అంటూ వారిపై నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చేసేదంతా ఇక్కడ హైదరాబాద్లో వీరంతా చేసేసి.. జిల్లాల పై పడ్డారు.
ఏ ఒక్కనాడైనా స్టేట్ వైడ్ కాల్ ఒక్కటంటే ఒక్కటి ఇచ్చారా..? రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ఒక్క సమస్యపైనా పోరాడింది లేదు. మొన్నటికి మొన్న ఫీజు రియంబర్స్మెంట్పై హైదరాబాద్లో ఆందోళన చేశారు. కానీ దానికీ సరైన స్పందన రాలేదు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై కేంద్రం లాఠీలు ఝుళిపించడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం.. వారిపై దాడిని జాతి మొత్తం ఖండించిన వేళ.. ఇక్కడ బీజేపీ నేతలు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ విద్యార్ధుల పక్షాన పోరాడుతున్నామన్నా ఎవరూ నమ్మలేదు.
దీంతో ఢిల్లీ జెన్-జీ ఉద్యమం.. అక్కడ కేంద్రాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో.. ఇక్కడ తెలంగాణ నేతలను, పార్టీని కూడా ఇబ్బంది పెట్టింది. దీంతో ఏం చేయాలో తెలియక.. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. జిల్లాల అధ్యక్షులు ఇక ఉండరు..వీరిని మార్చేస్తాం.. అంటూ కామెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది ఆపార్టీలో.