నిన్ననే అన్నాడు కేటీఆర్. విధ్వంసాల కోసం హైడ్రాను ఏర్పాటు చేసుకున్నారని. మేము అధికారంలోకి రాగానే హైడ్రాను తొలగించేస్తామన్నాడు. గతంలోనూ ఇవే మాటలన్నా.. తాజాగా హైకోర్టు కూడా హైడ్రా విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది.
కేసీఆర్ కూడా హైడ్రాను తీసి అవతలపారేస్తమన్నాడు. వాస్తవానికి దీనిపై పేద జనానికి పెద్ద ఇంట్రస్టు లేదు. ఇది రాజకీయ అవసరాల కోసమే సర్కార్ వాడుకుంటుందనేది బాగా ప్రొజెక్టు చేయగలిగింది ప్రతిపక్షం. ఒక్క బతుకమ్మ కుంట విషయంలో తప్ప.. అన్నీ ఆక్రమణలపై దాడులు చేయడమే లక్ష్యంగా హైడ్రా తీరు కొనసాగుతోంది.
ఆ బతుకమ్మ కుంట ఇష్యూ కూడా కోర్టు పరిధిలో ఉన్నదే.. అది బీఆరెస్ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి ఎడ్ల సుధాకర్రెడ్డికి సంబంధించిన ల్యాండ్ కావడంతో దీనిపై సర్కార్ దూకుడుగానే పోయింది. కోర్టు పరిధిని దాటి ముందుకెళ్లింది. ఆ తరువాత కోర్టు జోక్యంతో కొద్దిగా వెనక్కి తగ్గినా… బతుకమ్మ కుంట మాత్రం ఇంకా వివాదంలోనే ఉన్నది.
ఇప్పుడు లోతుకుంట భూ వివాదం విషయంలో హైడ్రా .. హైకోర్టు నుంచే తీవ్ర వ్యాఖ్యలు ఎదుర్కోవడం రాజకీయంగా చర్చకు వస్తోంది. రంగనాథ్ హద్దులు మీరి ముందుకు పోతున్నాడని, చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉందని.. అతనో సూపర్ కాప్ అనుకుంటున్నాడని కూడా హైకోర్టు అన్నది. రాజ్యాంగేతర శక్తితో పోల్చడం.. ఒక్క రంగనాథ్ను ఉద్దేశించి కాదు.. అక్కడ సీఎం రేవంత్రెడ్డి ప్రస్తావన కూడా పరోక్షంగా తీసినట్టేనని భావించాలి.
మొన్ననే రేవంత్రెడ్డి హైడ్రా చర్యలను మెచ్చుకున్నాడు. రంగనాథ్కు కితాబిచ్చాడు. ఇప్పుడు హైకోర్టు రంగనాథ్ను తప్పించి.. ఓ ఐజీ స్థాయి పోలీసు ఆఫీసర్ను నియమించాలని సీఎస్ను ఆదేశించింది. వాస్తవానికి అక్కడ రంగనాథ్ ఉన్నా.. మరెవరున్నా.. చేసేది అదే. సర్కార్ ఉద్దేశ్యమదే అయినప్పుడు.. ఎవరుంటే ఏంటీ? కాకపోతే ఆ దూకుడు కొంత తగ్గుతుంది.
కానీ టార్గెట్ మాత్రం అదే ఉంటుంది. సమయం కోసం చూడడమే మిగిలి ఉంటుంది. తొలత దీన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికే అని జీవో ఇచ్చింది సర్కార్. అంటే చెరువులు, రోడ్లు , ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు.. కానీ.. ఇది ఇప్పుడు ప్రైవేటు సామ్రాజ్యంలోకి దూసుకెళ్లింది. ఆ బుల్డోజర్.. ఎంపిక చేసి మరీ టార్గెట్లు చేయడంతోనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అన్నీ ఆక్రమణలే.. అందులో వాస్తవముంది.
కానీ ఎక్కడ ఈ గొడవ వస్తుంది..? అంటే కోర్టు లిటిగేషన్లలో ఉన్నవే ఎక్కువ ఉండటం.. తమ లక్ష్యం కోసం.. రాజకీయాల టార్గెట్లో భాగంగా సర్కార్ .. కొన్ని కోర్టు పరిధిలోని ఆస్తులపైనా దాడులకు దిగుతున్నది. ఇక్కడే కోర్టుకు కోపమొచ్చింది. అక్రమార్కులకు ఇది మంచి అస్త్రంగా దొరికింది.
అందుకే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా.. కోర్టుతోనే సర్కార్కు మొట్టికాయలు వేసేలా చేస్తే.. సరిపోతుందని భావించింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం కూడా తోడయ్యింది. అందుకే అంతిమంగా కోర్టుతో రంగనాథ్ను తిట్టించారు. అంటే సర్కార్ పైనే అక్షింతలేపించారు. రేవంత్రెడ్డి దీన్ని పక్కాగా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నాడనేది కోర్టు పరోక్షంగా ప్రస్తావించిన అంశంగా ఇక్కడ చూడాల్సి ఉంటుంది.
ఈ హైడ్రాతో జనానికి పెద్ద ఇంట్రస్టు కూడా లేదు. దీనిపై వారి నుంచి సర్కార్కు మద్దతు కూడా లభించదు. పైగా ఇలాంటి వ్యాఖ్యలు, నిందారోపణలు కూడా తోడైతే.. బద్నామయ్యేది సర్కారే. అంటే రేవంత్రెడ్డే.