Annamalai: దక్షిణాదిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ముగియలేదు. అప్పుడే రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా ఇండియా కూటమి కంటే.. ఎన్డీయేలో సీట్ల పంపకాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు తెరపైకి వచ్చింది.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎవరంటే ముందుగా అన్నామలై పేరు వస్తుంది. అక్కడ బీజేపీ ఓట్ల శాతం పెంచడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ స్థాయికి తెచ్చారు. ఈసారి అక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన్ని రాజ్యసభకు పంపాలని బీజేపీ డిసైట్ అయినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే మే చివరి నాటికి ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని ఏపీ కోటాలో పెద్దల సభకు పంపాలని కమలనాథులు నిర్ణయించినట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జూన్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో అన్నింటినీ ఎన్డీయే కూటమికి దక్కనున్నాయి.
ఏపీ నుంచి రాజ్యసభ రేసులో అన్నామలై?
పొత్తులో భాగంగా టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు చెరొక సీటు కేటాయించడం ఖాయంగా ప్రచారం సాగుతోంది. గతవారం సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్-ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మధ్య దీనిపై చర్చలు జరిగినట్టు అమరావతి నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
బీజేపీకి ఇచ్చే ఆ సీటు అన్నామలైకి కేటాయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల మాట. విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఏపీ నుంచి అన్నామలై రాజ్యసభకు పంపుతారంటూ వార్తలు వచ్చాయి. ఆ సీటు కాస్త మరొక బీజేపీ నేత వెంకట సత్యనారాయణకు దక్కిన విషయం తెల్సిందే. ఇదిలా వుండగా జనసేన ఒకరు, టీడీపీ మరో ఇద్దరు పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.
ALSO READ: ఎన్టీఆర్కు- నాదెండ్ల మధ్య ఏం జరిగింది? ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు?
జనసేన తరపున లింగమనేని రమేశ్ పేరు మొదటి నుంచి బలంగా వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఆశావహుల జాబితా పెద్దగా ఉంది. మంత్రి లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా, యనమల, దేవినేని ఉమా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ఇందులో ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుందో చూడాలి.