Nadendla Bhaskara Rao: ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు. ఆయన పేరు చాలామందికి సుపరిచితం. ఎందుకంటే.. రాజకీయాలు ఏ విధంగా చెయ్యాలో ఆయన ద్వారానే తెలుగు ప్రజలకు తెలిసింది. టీడీపీ విషయంలో అదే చేశారు. ఇంతకీ నాదెండ్ల భాస్కరరావుకు-ఎన్టీఆర్కు ఎక్కడ చెడింది? వీరి మధ్య వివాదానికి కారణం ఎవరు?
ఎన్టీఆర్కు- నాదెండ్ల మధ్య ఏం జరిగింది?
నాదెండ్ల భాస్కరరావు సొంతూరు గుంటూరు జిల్లా. 1935, జూన్ 23న జన్మించిన అంచెలంచెలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆయన, రాజకీయ ప్రస్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. 1978లో విజయవాడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ఆ తర్వాత కాలంలో ఆయన చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. అక్కడి నుంచే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఒంట బట్టించుకున్నారు. ఆనాటి నుంచి ఎత్తుకుపై ఎత్తులు వేయడం మొదలుపెట్టారు. కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పని చేశారు. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం పని చేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉండేవారు. ఈలోగా ఎన్టీఆర్ పార్టీ పెడుతున్న విషయం తెలియగానే ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో నాదెండ్ల భాస్కర్రావు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ మాటలు, ప్రజల నుంచి స్పందన చూసి కాబోయే ముఖ్యమంత్రి సంభోదించారు కూడా. ఆ పార్టీకి పునాది వేయడంలో వ్యూహకర్త కూడా. 1983 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అంతేకాదు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక నాదెండ్ల రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పద ఘట్టం మొదలైంది.
నాదెండ్ల ఆత్మకథలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు?
1984లో ట్రీట్మెంట్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు ఆనాటి రాజకీయ సంక్షోభానికి గవర్నర్ రామ్లాల్ ఉన్నారన్నది కొందరు టీడీపీ నేతల మాట. ఆయన సహాయంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రాజకీయం వెనుక అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని ఇప్పటికీ కొందరు టీడీపీ నేతలు చెబుతుంటారు. అమెరికా నుంచి ఎన్టీఆర్ తిరిగొచ్చిన తన బలాన్ని నిరూపించుకోవడంతో కేవలం 31 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు నాదెండ్ల.
ఈ ఎపిసోడ్.. నాదెండ్ల జీవితంలో కీలకం, వివాదాస్పద అధ్యాయంగా చెబుతున్నారు. తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్-నాదెండ్ల భాస్కరరావు మధ్య జరిగిన 1984 నాటి ఉదంతం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ గురించి రెండుపార్టులుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా వచ్చినప్పటికీ అందులోకి కీలక అంశాలను దాచి పెట్టారని ఇప్పటికీ కొందరు నేతలు చెబుతున్నమాట. తన రాజకీయ జీవితంలోని ఈ సంఘటనల గురించి ‘నా అంతరంగం’ అనే ఆత్మకథలో నాదెండ్ల తన వెర్షన్ను వివరించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
ALSO READ: కాళేశ్వరం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చర్చకు వచ్చిన ప్రధానాంశాలు..!
పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998లో ఖమ్మం ఎంపీగా ఆయన గెలుపొంది లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయన పలుమార్టీలు మారారు కూడా. ఇక నాదెండ్ల భాస్కర్రావు కొడుకు నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పని చేశారు. ఈలోగా విభజన జరగడంతో జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు.