తెలంగాణ బీజేపీకి తనే ప్రెసిడెంట్ కాబోతున్నట్టు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంకేతాలిచ్చాడు. ఆ విషయం తనే చెప్పుకున్నాడు. యాదాద్రిలో జరిగిన పార్టీ మీటింగుకు ఇవాళ హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా వాటిని ప్రచారం చేసుకోవడంలో తెలంగాణ బీజేపీ విఫలమైందని అన్నాడు. అందుకే ఇక్కడ బీజేపీ ఎదగలేకపోతున్నదని, ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడ గెలిచినా.. కేవలం అది మోడీ చరిష్మా చూసే గెలిచమని, అందులో ఇక వేరే అనుమానమే లేదన్నారు.
అయితే ఆ గెలిచిన చోట నాయకులు మోడీ చరిష్మాను బాగా వాడుకుని, ప్రచారం చేసుకుని గెలిచారని, మిగిలిన చోట్ల అది జరగకనే పార్టీ ఓడిపోతున్నదని అర్వింద్ అభిప్రాయపడ్దాడు. తెలంగాణ బీజేపీకి నోరున్న ప్రెసిడెంట్ కావాలని, అలా లేకే తగినంత ప్రచారం చేసుకోలేకపోతున్నామని పరోక్షంగా ఇప్పుడున్న రాంచంద్రారావు ఇందులో విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు అర్వింద్. త్వరలో నోరున్న ప్రెసిడెంట్ రాబోతున్నాడని తనే త్వరలో రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానని ఇలా మీడియా ముఖంగా పరోక్షంగా వెల్లడించాడు అర్వింద్.
ఇక్కడ సింగిల్గానే బరిలో ఉంటామని, అయినా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి నాడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా మారిందో వివరించాడు. అసలు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఎదగడం కష్టమేనని బీజేపీ పెద్దలే అనుకున్నారని, కానీ ఒరిస్సా, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో ఇవాళ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు. అంత కష్టమైన ప్రాంతంలోనే బీజేపీ తన పట్టు నిలుపుకున్నప్పుడు తెలంగాణ అసలు సమస్యే కాదన్నాడు అర్వింద్. ఇక్కడ గెలవడం చాలా ఈజీ అని కూడా చెప్పాడు.
కరెక్టుగా మోడీని వాడుకుంటే ఇక్కడా మేమే గెలుస్తామని, ఆ నోరున్న అధ్యక్షుడు త్వరలో రాబోతున్నాడని తనే ప్రెసిడెంట్ కాబోతున్నానని, తన ఆధ్వర్యంలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పాడు అర్వింద్. ఇప్పటికే అర్వింద్ కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల బండి సంజయ్ కొడుకు విషయంలో నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో.. అతన్ని తప్పించి అర్వింద్కు ఇస్తారని ప్రచారం చేసుకున్నారు ఆయన అనుచరులు. కానీ అధిష్టానం మాత్రం అలా చేసేందుకు రెడీగా లేదు. బండి సంజయ్ను ఇప్పట్లో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించే సూచనలు కనిపించడం లేదు.
దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి పై అర్వింద్ కన్నేశాడు. దీనిపై మరి అధిష్టానం క్లారిటీ ఇచ్చిందనే లెవల్లోనే అర్వింద్ మాటలు కనిపించాయి. లేదా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండొచ్చనే విధంగానే ధీమా కనిపించింది అతని మాటల్లో. అంటే త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందో లేదో తెలియదు కానీ.. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి మార్పైతే అనివార్యంగా కనిపిస్తున్నది. అర్వింద్ తాజా కామెంట్లు ఆ పార్టీలో చర్చకు తెర లేపాయి.