TamilNadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కిందా? అధికార డీఎంకె-విపక్ష అన్నాడీఎంకె- విజయ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదా? సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తున్నాయా? ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు రంగంలోకి దిగనున్నారా? తొలుత పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని ఎన్డీయే భావించిందా? ఆపరేషన్ వల్ల సీఎం చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారా? ప్రచారంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు? ఇదే చర్చ ఇప్పుడు తమిళనాటలో మొదలైంది.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు రెస్ట్ లేకుండా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈనెల 23న అంటే గురువారం పోలింగ్ జరగనుండడంతో అధికార డీఎంకె-అన్నాడీఎంకె- విజయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి తమిళనాట ముక్కోణపు పోటీ జరుగుతుందని అక్కడి ఓటర్లు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్డీయే తరపున ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. ఈనెల 20న అనగా సోమవారం నుంచి రెండురోజులపాటు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. అమరావతి నుంచి నేరుగా కోయంబత్తూరు వెళ్తారు. కోయంబత్తూరుతోపాటు హోసూరు, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు.
రెండురోజులపాటు దక్షిణ తమిణనాడులో.. ఏయే అంశాలు ప్రస్తావిస్తారోనన్న చర్చ
దక్షిణ తమిళనాడులో ఎక్కువమంది తెలుగు ఓటర్లు ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం చేశారు. తొలుత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలోకి దించాలని ఎన్డీయే భావించిందట. అయితే ఆయనకు ఆపరేషన్ జరగడంతో ప్రచార రంగంలోకి చంద్రబాబు దిగుతున్నారు.
హోసూరు సమీపంలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత ఆవడిలో రోడ్ షో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేస్తారు. మంగళవారం మధురై, సాత్తూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్ట సవరణ వీగిన తర్వాత అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు.
ALSO READ: వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ
ఈ సందర్భంగా ఆయన ఏయే అంశాలను ప్రస్తావించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. గతవారం కొన్ని సంస్థలు సర్వేలు చేపట్టాయి. అయితే అధికార పార్టీకి సానుకూలంగా ఉందని తేల్చాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత చీలిపోతుందని, చాలావరకు విజయ్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్డీయే ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. మరి చివరి రెండురోజులు ఓటర్ల నాడి ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. కేవలం అభివృద్ధి అజెండాగా సీఎం చంద్రబాబు ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.