Talasani Srinivas: కరీంనగర్ వేదికగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేపు జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ బయటకు రావడం లేదని, అసెంబ్లీకి రావడం లేదని విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులకు, ఇప్పుడు ఆయన వస్తున్నారనే వార్త వినగానే వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ కేవలం ఒక్కసారి కృష్ణా జలాల గురించి మాట్లాడితేనే.. ఈ ప్రభుత్వం పది రోజుల పాటు తల పట్టుకుందని గుర్తు చేశారు. కేసీఆర్ రాకను చూసి భయపడే, హడావుడిగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారని, సీఎం కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్నారని విమర్శించారు.
గడిచిన పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని తలసాని కొనియాడారు. 24 గంటల కరెంట్, సాగు, తాగునీరు అందించడంతో పాటు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, గురుకుల పాఠశాలలు నిర్మించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. దేశం గర్వించేలా సచివాలయం, అంబేద్కరుడి భారీ విగ్రహం, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రానికి ఆస్తులు సమకూర్చారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన అప్పుల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, గతంలో తాము చేసిన అప్పులతో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని నిలదీశారు. తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిపిన చరిత్ర కేసీఆర్ది అని గర్వంగా చెప్పారు.
ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్, గత ఆరు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని తలసాని విమర్శించారు. ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు తెచ్చిన గొప్ప నాయకుడిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ వారికి లేదన్నారు. కరీంనగర్ రూపురేఖలు మార్చిన అభివృద్ధిని కళ్లముందు ఉంచుకుని ప్రజలు ఆలోచించాలని కోరారు. రేపు జగిత్యాలలో జరిగే సభకు, అలాగే జీవన్ రెడ్డి పార్టీలో చేరిక కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: ఆదివాసీల కోసం రంగంలోకి కవిత.. కేంద్రానికి చుక్కలు చూపించే ప్లాన్ సిద్ధం!