డెబ్బైవేల పుస్తకాలు చదివానన్న కేసీఆర్ కంటే… ఆ తమిళనాడు స్టాలిన్ చాలా బెటరంటున్నారంతా. ఎందుకో తెలుసా? ఆయన ఓడిపోగానే.. అక్కడి జనానికి ఇచ్చిన సందేశం చూసి. తనను, తన పార్టీ పట్ల నమ్మకం సడలని ఓటర్ల గురించి తను స్పందించిన తీరును చూసి. ఓటేసి గెలిపించిన ప్రజలను వ్యక్తిగతం వెళ్లి కృతజ్ఞతలు చెప్పాలని ఆయన తన పార్టీ నేతలకు సూచించారు. హుందాగా ఓటమిని స్వీకరించారు.
జనంలోనే ఉందాం.. మళ్లీ గెలుస్తామనే ధీమాను కల్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే మనకు పూజ్యులు. మనం వారి కోసమే పార్టీని నడుపుతున్నాం. వారి కోసమే రాజకీయం చేస్తున్నాం. కాబట్టి అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా వెళ్లి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను… ఈ మెసేజ్ ఒక్కటి చాలు అక్కడి జనానికి. ఓటమిలో ఇలా కదా ఉండాల్సింది ప్రతిపక్ష నేత. మరి మన దగ్గర కేసీఆర్ ఓడిన తరువాత ఏం చేశాడు..? ఇప్పుడిదీ తెలంగాణలో చర్చ. ఆయన ఎన్నికలకు ముందే తన ప్రచారంలో ప్రజలను బెదిరించడం మొదలుపెట్టాడు.
ఆగమైతే గోసపడతం.. అన్నడు. మాకు కాకుండా కాంగ్రెస్కు ఓటేస్తే.. నాకు నష్టం లేదు.. మీకే నష్టం.. నేను వెళ్లి ఫామ్హౌజ్లో రెస్ట్ తీసుకుంటాను..! అని కూడా అన్నాడు. తీరా ఓటమిని చవి చూసిన తరువాత జనానికి ముఖం కూడా చూపలేదు. ఓ మాటలేదు.. ఓ పత్రిక ప్రకటన లేదు. జనం మీద అలిగాడు. ఫామ్హౌజ్కే పరిమితమయ్యాడు. ఇది చాలదంటూ అవకాశం దొరికినప్పుడల్లా జనాన్ని చీదరించుకునేలా తిట్లు, విమర్శలు. అవమానపరిచేలా మాటలు.. చెప్తే వినలేదుగా బాగైందనే విధంగా చేతలు. ఓ ఉద్యమ దళపతి, సీఎంగా రెండు టర్ముల అనుభవం.. అంతకు ముందు వేల పుస్తకాలు చదివిన మేధావితనం.. ఇవన్నీ ఒక్క ఓటమితో ఎటు కొట్టుకుపోయాయో.. అధికారం ఇస్తేనే మంచి మనుషులు.. లేకపోతే దొంగలా? ఆశ పడి ఆగమైనోళ్లా..? జన నాయకుడిగా ఉండాల్సిన నేత… జనాన్నే తప్పుబట్టే విధంగా మసలుకుంటే ..! అదే చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్ కూడా.
పదేళ్లు అధికారంలో చేసిన తప్పిదాలు చేయకుండా.. బుద్దిగా నడుచుకుంటామనే మెసేజ్ ఇవ్వకపోగా.. మేమంతా కరెక్టుగానే ఉన్నాం.. పంట మార్పిడిలా పదేళ్లకోసారి సర్కార్ను ఎట్లా మారుస్తారు.. అని కూడా కేటీఆర్ ఈ మధ్య నిలదీశారు. కుండ పగిలితే కుక్క బుద్ది తెలుస్తుంది అంటారు. అధికారంలో ఉన్నప్పుడు అలా.. ఎవరి మాట లెక్కలేదు. ఓటమి తరువాత ఇలా.. జనంపై అలిగి అదే లెక్కలేని తనంతో కంటిన్యూ కావడం. అందుకే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న ఇలాంటి నేతల వల్ల జనాలు ఏమని ఆలోచించుకుంటారు. బెదిరిస్తే.. అవమానిస్తే.. వింటారా? జనం నాడి ఇదేనా మీరు తెలుసుకున్నది? అనే నిలదీతలు బీఆరెస్ పెద్దలను వెంటాడుతున్నాయి. అయినా వారు మారడం లేదు. పరివర్తన చెందడం లేదు. జనం మీద ఉన్న కోపాన్ని ఇప్పట్లో వదిలేలా లేరు. తిరిగి మళ్లీ తమకు అధికారం ఇచ్చేదాకా.