ఓవైపు రాష్ట్రంలో ఎండలు మండుతుంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నది. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్, మంథని నియోజకవర్గంలోని కాటారం వేదికగా అధికార కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఓవైపు కేసీఆర్.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడనున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రోజూ ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత గత కొంతకాలంగా ఏమీ మాట్లాడలేదు. ఫాంహౌస్కే పరిమితం అయ్యారు. తాజాగా కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలిసి రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గత వారం కింద ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలకు వీలైనంత త్వరగా మరమ్మతులు నిర్వహించి వాడుకలోకి తేవాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.ప్రాజెక్టు డ్యామేజీపై సర్వే నిర్వహించిన ఎన్డీఎస్ఏ అథారాటీ నివేదిక మేరకు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.ఈ క్రమంలోనే తానూ ప్రాజెక్టును సందర్శిస్తానని ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ కాళేశ్వరం సందర్శనకు వెళ్లారు.
ముందుగా బ్యారేజీల సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాటారం చేరుకోనున్నారు. అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగసభకు హాజరుకానున్నారు. అనంతరం రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కీలక ప్రసంగం చేస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే, బీఆర్ఎస్ జగిత్యాలలో నిర్వహిస్తున్న సభకు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ సైతం భారీ బహిరంగ సభను నిర్వహిస్తుందని టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ జగిత్యాల వేదికగా చేసే విమర్శలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇస్తారని తెలుస్తున్నది. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయ్యింది.ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించని రేవంత్ సర్కార్..కేసీఆర్ బయటకు వస్తున్నారని తెలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లడం ఏంటని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
జీవన్ రెడ్డి చేరికతో హరీష్ రావు అసంతృప్తి.. కేటీఆర్ బతిమాలుకుని మరీ..? అద్దంకి దయాకర్ సంచలనం
దీనికి సైతం సీఎం రేవంత్ తగిన సమాధానం చెబుతారని హస్తం పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే జగిత్యాలలో కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యాకే సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుందని చర్చ జరగుతున్నది.కేసీఆర్ అడిగే ప్రశ్నలకు, చేసే విమర్శలకు దీటుగా బదులివ్వాలని సీఎం రేవంత్ ఆలోచన చేసినట్టు సమాచారం. కాగా, మాజీసీఎం, ప్రస్తుత సీఎం నడుమ ఎటువంటి మాటల యుద్ధం నడుస్తుందో అని పలువురు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సీఎంకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా? లేదా సీఎం రేవంతే బీఆర్ఎస్ లెక్క తేలుస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.