కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుంది. బొగ్గు లారీ ఢీకొని మృతి చెందిన డీటీవో వెంకన్న ఉదంతంలో బొగ్గు మాఫియా ఉందని హరీశ్రావు ఆరోపించారు. ఇది పాత పదేళ్ల పాలనా కాలాన్ని తోడుకున్నట్టైంది. అవును.. వాస్తవానికి ఇది ఉద్దేశ్య పూర్వకంగా జరిగిందా..? అనే విషయంలో క్లారిటీ లేదు. దీనిపై విచారణ జరుగుతున్నది. విచారణ అధికారిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ను ప్రభుత్వం నియమించింది.
అయితే బొగ్గును ఈ రోడ్డు మార్గం ద్వారా తరలించే విషయంలో 13 ఏళ్లుగా లోకల్ లీడర్లు కోట్లు గడిస్తున్నారనే విషయం వెలుగుచూసింది. ఈ అంశంపై టీఆరెస్ చీఫ్ కవిత స్పందించారు. వెంకన్న మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఎంతో భవిష్యత్ ఉన్న అధికారిని ప్రమాదం బలితీసుకోవడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని.. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించాలని.. వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆమె.
భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ (జెన్ కో)కు తాడిచర్ల కోల్ మైన్ కేటాయించి 13 ఏళ్లు గడిచిందని.. 13 ఏళ్లుగా తాడిచర్ల – భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ కు ఎందుకు రైల్వే లైన్ వేయలేదని ఆమె ప్రశ్నించారు. తాడిచర్ల నుంచి భూపాలపల్లి కి మధ్య దూరం 48 కి.మీ… వాస్తవానికి ఈ బొగ్గును తరలించేందుకు రైల్వే లైన్ వేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో దీన్ని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తరువాత.. బీఆరెస్ కూడా బొగ్గు మాఫియాలో చేరిపోయింది.
పాలకులు ఎవరున్నా.. ఈ బొగ్గు తరలింపులో వచ్చే అక్రమ ఆదాయానికే అలవాటుపడ్డారు… తప్ప రోడ్డు మార్గం ద్వారా తరలించే క్రమంలో జరిగే ప్రమాదాలను పట్టించుకోలేదు. ఇప్పుడు వెంకన్న ఈ పాలకుల నిర్లక్ష్యానికే బలయ్యాడనేది కవిత ప్రధాన ఆరోపణ. అప్పుడు పదేళ్లూ బీఆరెస్ ఈ విషయం పట్టించుకోలేదు.. ఇప్పుడున్న సర్కార్ రెండున్నరేండ్లలో దీని గురించి కనీసం ఆలోచన చేయలేదని ఆమె రెండు పార్టీల పాలనను నిలదీశారు. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అలసత్వమే కారణమని మండిపడ్డారు.
రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాతో కొందరు స్థానిక నాయకులు కోట్లు కూడబెట్టుకుంటుంటే.. అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వెంటనే తాడిచర్ల నుంచి భూపాల్లిపల్లికి రైల్వే వేసే పనులను ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆరెస్ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది. మాఫియా ముసుగులో డీటీవోను హత్య చేశారనేది ఆ పార్టీ ఆరోపణ.
కానీ ఆ మాఫియా పదమూడేళ్లుగా రాజ్యమేలుతున్నదనేది వాస్తవం. మరి ఒకవేలు ఇటు చూపితే.. మిగిలనవన్నీ అటే చూపుతున్నాయి. తమ పదేళ్ల పాలనలో ఎందుకు రైల్వే లైన్ ఊసెత్తలేదు.. ఈ బొగ్గు లారీలు అప్పట్నుంచే నడుస్తున్నాయి ఈ రోడ్డు మార్గాన! మరి అప్పుడు మాఫియా లేదా? ఉంది. అప్పుడు బీఆరెస్ లీడర్లు ఈ బొగ్గు రవాణకు వంత పాడితే.. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఫలితంగా ఈ రోడ్డు వెంబటి ఉన్న జనాలు బలై పోతున్నారనే విషయం కవిత ద్వారా బయటకు వచ్చింది.
మాఫియా ఎవరో కాదు లీడర్లే. అప్పుడు బీఆరెస్కు చెందిన లీడర్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతే తేడా! దొందూ దొందే.. మధ్యలో బలైంది మాత్రం.. డీటీవో వెంకన్న. మరి దీనిపై సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇన్నాళ్లూ సాగిన బొగ్గు రవాణా దందా బాగోతాన్ని కంటిన్యూ చేస్తుందా? దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు రైల్వే లైన్ ఆలోచన ఏమైనా చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది.