తెలంగాణకు జాతిపిత ఎవరు? అనే వివాదం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో నడుస్తున్నది. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా కీర్తించడాన్ని సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఎవనికి రా నవ్వు జాతిపిత.. ? నీ కులానికి నువ్వు జాతిపితవు కావొచ్చు.. మాకు కాదు.. అంటూ బహిరంగ వేదిక మీదే సీఎం విమర్శించడం తీవ్ర చర్చకు తెర తీసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గద్దర్ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నది. గద్దర్ సినీ అవార్డులను కూడా ఏర్పాటు చేసింది. అయితే , మధ్యలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన నివాసం ఉంటున్న నందినగర్ ఇంటి గోడలకు నోటీసు పత్రాలను అంటించి వెళ్లారు. దీంతో బీఆరెస్ భగ్గుమన్నది. తెలంగాణను ప్రాణాలకొడ్డి సాధించిన.. తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ను విచారణకు పిలవడమా అంటూ నినాదాలు హోరెత్తించారు. ఫ్లెక్సీలు వెలిశాయి. పోస్టర్లు వేశారు.. నిరసనలు చేశారు.
ఈ పరిణామం రేవంత్ రెడ్డి కి కోపం తెప్పించింది. అందుకే బహిరంగ సభ వేదికగానే ఆయన ఎవనికి రా నువ్వు జాతిపిత అని దూషించడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఆ తరువాత ఈ నినాదం గొడవ సద్దుమణిగింది. ఎవరూ ఆనాటి నుంచి జాతిపిత అనే పదాన్ని వాడటం లేదు. కానీ ఇన్ని రోజుల తరువాత కేటీఆర్ మళ్లీ ఈ జాతిపిత నినాదాన్ని బయటకు తీశాడు.. కేసీఆర్ కచ్చితంగా తెలంగాణ జాతిపితనే అన్నాడు. యావత్ తెలంగాణ ప్రజలు ఆయనను తెలంగాణ జాతిపితగానే చూస్తున్నారని, చూస్తారని కూడా క్లారిటీ ఇచ్చాడు ఇవాళ.
తెలంగాణ భవన్లో కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఈ మాటలన్నాడు. కేసీఆర్కు గాడ్ ఫాదర్ జయశంకర్ సార్ అని.. కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో జరిగిన వివాదం కేటీఆర్కు తెలియక కాదు. నీ జాతికే నువ్వు జాతి పితవు.. మాకు కాదు అని అన్న రేవంత్రెడ్డికి ఈ విధంగా మరోసారి బదులిచ్చాడా? అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
అంతే కాదు.. మరో సందర్భంలో బహిరంగ వేదికగానే కేసీఆర్ కులాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ మాట్లాడిన మాటలు కూడా అప్పుడు వైరల్ అయ్యాయి. నీ కులమెంత..? నువ్వెంత? తెలంగాణలో నీ కుల బలమెంత? అనే విధంగా ఆయన మాట్లాడాడు. దీనిపై మాత్రం కేటీఆర్ ఆ తరువాత క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణ గురించి కనీసం సోయి లేని నీ కులమైతే మాది కాదు.. అంటూ తెలంగాణకు, తమ కులానికి, కేసీఆర్ స్టాండ్ను జోడించి సమర్థించుకునే ప్రయత్నం చేశాడు కేటీఆర్.
పనిలో పనిగా రేవంత్రెడ్డి చరిత్ర హీనుడు అనే విధంగా అర్థం వచ్చేలా దూషించాడు పరోక్షంగా. ఇప్పుడు జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్, జయశంకర్లు ఇద్దరూ ఒకటేననే అర్థం వచ్చేలా మాట్లాడాడు కేటీఆర్. అంటే అప్పుడు జయశంకర్ సార్.. ఇక తెలంగాణకు ఇప్పుడు కేసీయారే.. అనే విధంగా జాతిపిత అనే బిరుదును కూడా అటాచ్ చేసి మాట్లాడాడు.
ఇప్పుడు ఇది మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో డిస్కషన్ పాయింట్ గా మారనుంది.