బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం దేశంలోని అన్ని బీసీ శక్తులను కలుపుకుని ఉద్యమాలు నిర్మిస్తామని ప్రకటించారు టీఆరెస్ చీఫ్ కవిత. టీఆరెస్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
జెనెజీ తరహాలో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. కేంద్రానికి నాలుగు నెలల డెడ్లైన్ విధించిన కవిత.. జనవరి తరువాత జరగబోయే బడ్జెట్ సమావేశాలలోగా బీసీల రిజర్వేషన్లపై స్పష్టత నివ్వాలన్నారు. ఉభయసభల్లో బిల్లు పాసయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే గుత్పలందుకుని బీసీలంతా కలిసి ఢిల్లీకి వస్తారని, అనుకున్నది సాధించే వరకు అక్కడి నుంచి కదలబోమన్నారు.
ఇప్పటి వరకు భౌగోళిక తెలంగాణ సాధించామని, కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు. ఈ సామాజిక తెలంగాణ సాధించేందుకే టీఆరెస్ పనిచేస్తుందన్నారు. సామాజిక తెలంగాణ అనగానే ఈ నినాదం అగ్రవర్ణాలకు వ్యతిరేకమని భావించొద్దని, అణగారిన వర్గాలు ఇన్ని ఏండ్లైనా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యారనే మానవీయ కోణంలో ఆలోచించి అంతా కలిసికట్టుగా టీఆరెస్ ఉద్యమానికి సంఘీభావంగా నిలవాలని ఆమె కోరారు.
అణగారిన వర్గాల కోసమే నా జీవితం అకింతమని ఈ వేదికగా కవిత భావోద్వేగంగా ప్రకటించారు. తను అగ్రవర్ణం బిడ్డెనని, తన పుట్టుక తన చేతుల్లో లేదని, కానీ తాను ఏమి చేయాలో, సమాజం హితం కోసం చేయాల్సిన కర్తవ్యాలేమిటో..? జాతి కోసం ఎలాంటి పోరాటాలు చేయాలో తెలిసిన వ్యక్తినని, అవన్నీ నా చేతుల్లో ఉన్నాయి కాబట్టే స్పష్టమైన నిర్ణయాలతో, ఆశయాలతో, లక్ష్యాలతో ముందుకు సాగుతున్నానని అన్నారు కవిత.
అధికారాన్ని వాడుకునే వ్యక్తిని కాదన్న ఆమె.. అలా తన సొంత ప్రయోజనాల కోసం ఆశించి ఉంటే తాను ఎక్కడనో ఉండేదాననని, కానీ తెలంగాణ సమాజం కోసం ఆలోచించి.. సామాజిక తెలంగాణ కోసం గొంతెత్తి బయటకు వచ్చానని, మాట ఇచ్చానంటే చచ్చినా వెనక్కి తగ్గనని, మడమ తిప్పేది ఉండదని ఆమె స్పష్టం చేశారు.
తనతో ఏమవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాలోని ధైర్యం, నా కమిట్మెంట్, అనుకున్నది సాధించే వరకు పోరాడే తత్వమే నన్ను ముందుకు నడిపిస్తదని, జాతిని కదిలిస్తుందని, అందరి మద్దతు అదే కూడగడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కనీసం వార్డు మెంబర్లు కూడా కాలేని బీసీలు ఉన్నారని, ఎస్సీల కంటే దారుణమైన బతుకులీడుస్తున్న బీసీల శాతం 75గా ఉందని లెక్కలు తేలాయని ఆమె వివరించారు.
పాలకులవి బీసీలపై ముసలి కన్నీళ్లేనని, వారి మెడలు వంచేలా ఉద్యమాలు చేసి అనుకున్న లక్ష్యం చేరుతామన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరుతామని అన్న ఆమె.. అది టీఆరెస్తోనే సాధ్యమన్నారు. ఉద్యమంలో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో జాతిని జాగృతం చేసిన తనకు.. సామాజిక తెలంగాణ బోనమెత్తాలని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పారని ఆమె గుర్తు చేశారు.
ఈ సభా వేదికగా ఆమె పార్టీ తరపున పది తీర్మానాలు చేశారు. సామాజిక న్యాయం సాధించి తీరుతామని పార్టీ కార్యకర్తలు, లీడర్లతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు.
ఇవే ఆ తీర్మానాలు!
50 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. సావిత్రాబాయి పూలేకు భారత రత్న ఇవ్వాలి. జయశంకర్ సార్కు పద్మ భూషన్ ఇచ్చి, ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలి. ఎస్సీల నిధులన్నీ వారికే ఖర్చు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి. ఆదివాసులకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించాలి. ఢీ లిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింలకు ఆర్థిక స్వావలంభన కల్పించాలి. ప్రత్యక కార్పొరేషన్ ఏర్పాటు చేయయాలి. వక్ఫ్ భూమలపై చట్టం తేవాలి. క్రిష్టియన్లకు, సిక్కులకు ఆర్తిక స్వావలంభన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ట్రాన్స్ జెండర్ల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. వికలాంగుల పించన్లు పెంచాలి.