ధాన్యం సేకరణ ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటున్నది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. జిల్లా కలెక్టర్లపైనే భారం వేసిన సర్కార్.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమూ ప్రధాన లోపంగా మారింది. చాలా సందర్బాల్లో సీఎం రేవంత్రెడ్డి పలువురు కలెక్టర్లనుద్దేశించి చెబుతూ ఉంటారు.. ఏసీ గదుల్లో కూర్చోవద్దు.. ఫీల్డులోకి వెళ్లండని! ఇదే ఇప్పుడు రైతుల ధైన్యానికి కారణమవుతోంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది.
సర్కార్ కు చెడ్డపేరు తెచ్చేలా.. రైతులను మరీ ఇబ్బందులకు గురి చేసేలా అక్కడి పరిస్థితులు తయారయ్యాయంటే కారకులు.. కలెక్టర్లే. ప్రభుత్వానికి వీరిపై మొదటి నుంచి పట్టులేదు. దీనికి తోడు బదిలీలు. జిల్లా ఇంచార్జి మంత్రులు పట్టించుకోరు. జిల్లాలకు చెందిన మంత్రులతో కలెక్టర్లు సమన్వయం చేసుకోరు. సర్కార్ను తప్పుదోవ పట్టించి.. ఫీల్డులో అంతా బాగానే ఉందనే సమాచారమే తప్ప.. నిజంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నదున్నట్టుగా ప్రభుత్వానికి నివేదించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా తాలు పేరుతో కడ్తా తీశారు. ఒక్కో బస్తా వెనుక 4,5 కిలోల తరుగును బాజాప్తా తీసుకున్నారు. దీనిపై సర్కార్ ఎక్కడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించలేదు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ జరగాల్సి ఉండే. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తూ 50 శాతం కూడా సరిగ్గా కాలేదు. ఓ వైపు అకాల వర్షాల భయం.. తేమ పేరుతో తరుగు.. తాలు పేరుతో కోతలు.. ధాన్యం అమ్ముకున్న తరువాత పైసల కోసం పడిగాపులు. ఇవన్నీ సమస్యలున్నాయి. కానీ కలెక్టర్లు ఎక్కడా దీన్ని ప్రభుత్వానికి సరిగా చెప్పడం లేదు. అది తమ వైఫల్యంగా భావిస్తారనే భయం కాబోలు. కానీ, అంతిమంగా ఆ చెడ్డపేరు సర్కారే మూటగట్టుకుంటున్నది. గతంలో ఇలా లేదు కదా..! అని ఏ ఒక్క రైతు అనుకున్నా.. రైతు వ్యతిరేకతను ఈ సర్కార్ మూటగట్టుకుంటుందన్నట్టే. మరి ఇంతటి సీరియస్ విషయంపై సర్కార్ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు.
ప్రతీ సీజన్లోనూ రైతులు కామన్గా ఎదుర్కొనే సమస్యలేనని లైట్ తీసుకుంటుందా? అదే కొంప ముంచుతుంది. ఇప్పుడు బాధలు మరిన్ని ఎక్కువయ్యాయి తప్ప.. తక్కువ కాలేదు. ఇలాంటి పరిస్థితుల కోసమే బీఆరెస్ వేచి చూస్తోంది. రైతులు ఎంత ఇబ్బండి పడితే అంత మంచిది అన్నట్టుగానే చూస్తుంది. సీఎం రేవంత్రెడ్డి అన్నట్టుగా శాడిస్టిక్ మెంటాలిటీతో కేటీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. అదే జరుగుతోంది. మరి ఎందుకు సర్కార్ మేల్కోవడం లేదు. మిల్లర్లకు ఎందుకు వార్నింగ్ ఇవ్వడం లేదు. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఎందుకు చేయడం లేదు? మూడు రోజుల్లోనే ధాన్యం పైసలు వేస్తున్నామని సీఎం చెబుతున్నారు. కానీ దాదాపు రెండు వారాలు పడుతుంది చాలా మంది రైతులకు.
ఈ విషయాన్ని కూడా వారు గత పాలనతో పోల్చి చూసుకుంటున్నారు. ఎక్కువలో ఎక్కువ వారం రోజులు పట్టేది అప్పుడు.. ఇప్పుడు దానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నారు.. అని రైతులు చర్చించుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు సర్కార్ దృష్టికి రావడం లేదనేది క్లారిటీ. దీంట్లో మాత్రం జిల్లా యంత్రాంగాలు సఫలమయ్యాయి. క్షేత్రస్థాయిలో రైతుల దైన్యాన్ని గుర్తించి.. ధాన్యం సేకరణలో అడ్డంకులు తొలిగేలా సమన్వయంతో పనిచేయడంలో పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఇదిలాగే జరిగితే ఈ సర్కార్కు ధాన్యం కొనుగోలు చేయడం రాదు.. రైతుల బాధలు తెలియవు.. మనల్ని పట్టించుకోరు..! అనే మెసేజ్ వెళ్తే.. ! అది మరింత ప్రమాదకరం. దీనిపై సీఎం ఇప్పటికైనా చొరవ తీసుకోవాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.