చంద్రబాబు పాలనలో ఏదో ఒక పథకానికి ఆయన మార్క్ ఉంటుంది. ఈ సారి ఆయన.. జనాభా పెంపు పథకంతో ముందుకు వచ్చారు. ఆయనంతే ఎవరు నవ్వుకున్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా తనకు నచ్చింది చేస్తాడు. దానికో విజన్ ఉంటుందంటారు. ఆ విజన్ అందరికీ అర్థం కాదనుకో. అది వేరే విషయం. ఇలా చంద్రబాబు ఏపీలో జనాభాను ఎడాపెడా విపరీతంగా పెంచాలని భావిస్తున్న తరుణంలో ఆ విజనరీ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే జనాభా పెంపు పథకం.. దీని కోసం ఆయన భారీ నగదు ప్రోత్సహకాలను కూడా ప్రకటించి ఉన్నారు.
మూడో సంతానానికి రూ. 30వేలు, నాలుగో సంతానానికి రూ. 40వేలు అందించనున్నట్టు తెలిపారు. దీన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. చంద్రబాబు ప్రపంచ దేశాలన్నింటినీ స్టడీ చేసి మరీ ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. చాలా దేశాలలో యువత శాతం తగ్గిపోతున్నది. వృద్దుల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో ఉత్పత్తి రంగాలు దెబ్బతినడం, ఆ వృద్ధాప్య భారంతో అక్కడి ఆర్థిక వ్యవస్థలు కూనరిల్లడం ఆయన చూశానని చెబుతున్నారు. అయితే అందులో తెలుగు వారి .. అదే ఆంధ్రవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోతుందనే బాధ బాబుకు ఉంది. అందుకే ఈ పథకాన్ని ఎవరు నవ్వుకున్నా.. ఎవరు విమర్శించినా ప్రకటించి ముందుకు తీసుకుపోతున్నారు.
ఇంతలోనే మోడీ గారి పొదుపు మంత్రం విడుదలైంది హైదరాబాద్ వేదికగా. మోడీ హైదరాబాద్కు ఇలా వచ్చి వెళ్లాడో లేదో.. ఏపీకి వెళ్లిన నేతలు, అక్కడి మంత్రుల బృందం తెల్లారి నుంచే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే నినాదాన్నెత్తుకుని ప్రపంచానికి వీరే చాటి చెప్పేందుకు కంకణం కట్టుకున్నట్టే చేశారు. అదిగో తోక.. అంటే ఇదిగో పడగ.. అన్నట్టుగానే తయారయ్యింది ఏపీ సర్కార్ పరిస్థితి. ఎంతైనా ఎన్డీయే మిత్రులాయె.. స్వామిభక్తి చాటుకోవాలె కదా…అందులోనూ అక్కడున్నది మన విజనరీ బాబుగారు.. ఇంకేముంది? వెంటనే కేబినెట్ మీటింగు పెట్టుకుని పొదుపు చర్యలన్నీ యుద్ద ప్రాతిపదికన తీసేసుకున్నారు.
కాన్వాయ్లు తగ్గించుకోవడం.. వారానికో సారి వెహికల్ హాలిడే.. ఎలక్ట్రిక్ వెహికిళ్ల కొనుగోళ్లు.. ఏం చేయాలో అన్నీ అన్నీ చేసేశారు. బహుశా పొదుపు మంత్రాన్ని పఠించి వెళ్లిపోయిన మోడీకి కూడా ఇన్ని రకాలుగా పొదుపు చర్యలు పాటించొచ్చా..? అని బాబుగారిని చూసి కచ్చితంగా ఆశ్చర్యపోయే రేంజ్లో చేసి చూపారాయన. అంతా బాగానే ఉంది గానీ.. మరి ఈ క్లిష్ట సమయంలో.. ఆర్థికంగా కష్ట సమయంలో.. ఈ పిల్లల గోల ఏలా? అనే సమస్యా వచ్చింది. అన్నీ నియంత్రిస్తున్నారు గానీ.. ఆ కుటుంబ నియంత్రణ మాత్రం ఉండదు.
నియంత్రణను ఎత్తేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. కొందరంటున్నారు..? ఈ పథకమేదో కొంతకాలం ఆపేస్తే బాగుంటుందేమో? అని. నో నెవ్వర్.. దేశానికి క్లిష్ట పరిస్థితులు ఇప్పట్లో తొలగవు.. అది మోడీకి, బాబుకు బాగా తెలుసు. జనాలని ఇలాగే భయభ్రాంతులకు గురి చేసి.. పొదుపు మంత్రాలు పాటిస్తూ… కలో గంజో తాగుతూ.. కృష్ణా రామ అని జపం చేస్తూ జీవించే విధానానికి అలవాటు చేయాలి. అలా అలవాటైన తరువాత.. రోజు రోజుకు జీవన ప్రమాణాలు ఎంత తగ్గినా.. చాలీ చాలని వేతనాలు వచ్చినా.. అడ్జస్ట్ కాగలుగుతారన్నమాట. భారత్ వెలిగిపోతూనే ఉంటుంది.
ఇక్కడ పొదుపు చర్యలు చేపడుతూనే ఉంటారు. ఇక ఈ జనాభా పెంపు పథకం ఎందుకు నిలపడం లేదో కూడా బాబుగారు క్లారిటీ ఇచ్చేశారు. పిల్లలే సంపద అన్నారాయన. మరి సంపదను సృష్టించే ఈ పథకాన్ని ఎందుకు ఆపాలి. ఈ క్లిష్ట సమయంలో, ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో సంపదేగా సృష్టిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగమే కదా అని సర్ధిచెప్పుకుంటున్నారు. అందుకే ఏపీలో ఆ ఒక్కటీ అడక్కు అంటున్నది అక్కడి సర్కార్!