వాతావరణంలో తీవ్ర మార్పులకు, కరువుకు కారణహేతువైన ఎల్నినో.. ఇప్పట్నుంచే అంతటా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం.. వల్ల మళ్లీ కరువు ఛాయలను జనం చూడాల్సి వచ్చేలా ఉందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ముఖ్యంగా ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావమే చూపనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సాగు వరే. సాగునీరు అధికంగా కావాల్సి వచ్చే వరి సాగునే ఇక్కడి రైతులు ఎంచుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంత నష్టం కలిగించినా ఈ సాగుకు బాగా అలవాటు పడ్డారు తెలుగు రైతాంగం.
తక్కువ పెట్టుబడి అవసరం పడుతుందని దీనికి అలవాటు పడటం.. ఎలాగైనా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది కదా..!అనే భరోసా కూడా రైతుకు తోడవ్వడంతో వరిసాగు ఏటేటా పెరుగుతూ వస్తోందే తప్ప విస్తీర్ణం తగ్గడం లేదు. వర్షాకాలంలో వర్షాధారిత పంటగా విస్తీర్ణం చాలా పెరుగుతుంది. యాసంగిలో .. బోర్ల ద్వారా భూగర్భజలాలాను వినియోగించుకుని వరిని సాగు చేస్తారు. కానీ కొంచెం ఈ సీజన్లో తగ్గుతుంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అలర్టయ్యింది. మొన్నటి దాకా ధాన్యం కొనుగోలు తిప్పలే సరిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 70 లక్షల టన్నుల దాకా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకో 5 లక్షల నుంచి పది లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది.
మరోవైపు వానాకాలం సీజన్ కోసం రెడీ అవుతోంది. రైతులు షరా మామూలుగానే వరిసాగుకు రెడీ అయిపోయారు. వరి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇక్కడే అప్రమత్తతను ప్రదర్శిస్తోంది. రైతులు ఈ విషయంలో ఎంత చెప్పినా వినరు. గతంలో ఈ అనుభవాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లరు. తుకాలు వేసుకునేందుకు రెడీ అవుతున్న రైతులకు అన్ని రకాల వరి విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదు. కేవలం కొన్ని రకాల వరి విత్తనాలను మాత్రమే.. అదీ మేలురకానికి సంబంధించినవి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీని ద్వారా సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గుముఖం పట్టించి.. ఆ మిగిలిన విస్తీర్ణం ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులను మళ్లించాలని సర్కార్ భావిస్తోంది.
కానీ రైతులు అంత తొందరగా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లరు. కొంచెం లేటైనా పర్వాలేదు.. వరిసాగుకే ప్రాధాన్యత చూపుతారు. మరి ఇదే జరిగితే ఈ కరువు ఎఫెక్ట్ వ్యవసాయ రంగంపై ఎంతగా పడుతుందోననే భయం సర్కార్ను వెంటాడుతోంది. రైతాంగం నష్టపోతే సర్కార్ ముందుస్తు చర్యలు తీసుకోవడంలో, వారిలో అవగాహన పెంచడంలో విఫలమైందనే అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే తాజాగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో.. సర్కార్కు విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షాల ఆందోళనలు.. అకాల వర్షాలు ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి.