సన్నబియ్యానికి బాగా అలవాటు పడ్డారు. ఇది పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలనే తేడా లేదు. అంతా అదే దారి. ఒక్కొక్కరి రేంజ్లో ఒక్కో ధర. కానీ అంతా ఫైన్ రైస్కే అలవాటుపడ్డారు. అవి బహిరంగ మార్కెట్లో కిలో బియ్యానికి కనీసం రూ. 45 నుంచి మొదలై .. రూ. 80 దాటి కూడా ఉంటున్నాయి. ఈ రేట్లు తగ్గడం లేదు. అటూ ఇటూగా పెరుగుతూ వస్తున్నాయి తప్ప.
అయితే అంతకు ముందు రేషన్ దుకాణాల ద్వారా వచ్చే దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేవారు దాదాపుగా. కిలోకు రూ. 12 నుంచి రూ. 15 వరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేవారు జనం. లేదా రేషన్షాపుల్లోనే డీలర్లు ముందుగానే మాట్లాడుకుని వారి వేలిముద్రలు తీసేసుకుని బియ్యం పోసినట్టుగా రికార్డు చేసుకుని ఆ బియ్యాన్ని అక్కడే గోదాములో పెట్టేసుకుంటారు. అలా ఒక్కసారిగా టోకున బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారికి అమ్మేసుకుంటారు. వారు అక్కడ్నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించడం షరా మామూలుగా జరిగేది.
సమాచారం వస్తే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ టీమ్ దాడి చేయడం.. పట్టుకోవడం కేసులు పెట్టడం అంతా రొటీన్ సిస్టం అప్పుడు. ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యమే పోస్తున్నారు. ఇక అంతా ఇదే తింటున్నారు..అని ప్రభుత్వం భావించి భ్రమిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయక్కడ. అప్పుడు దొడ్డు బియ్యం కిలో రూ. 15 వరకు అమ్ముకునే రేషన్కార్డు దారులు.. ఇప్పుడు వీటిని రూ. 20 దాకా అమ్ముకుంటున్నారు.
రేటు పెంచి అమ్ముకుంటున్నారే తప్ప.. వాటిని తినడానికి ఇష్టపడటం లేదు. ఇలా అందరూ చేస్తున్నారని ఈ కథనం ఉద్దేశ్యం కాదు. దొడ్డు బియ్యం అమ్ముకునే వారు అప్పుడు .. దాదాపు 60 శాతం దాకా ఉంటే.. ఇప్పుడు సన్నబియ్యాన్ని కూడా అమ్మేసుకుంటున్న 40 శాతం దాకా ఉన్నారు. అంటే అప్పటికీ ఇప్పటికీ 20 శాతం మాత్రం తగ్గింది అంతే.
వారు రేషన్ సన్నబియ్యానికే కనెక్టయ్యారు. బహిరంగ మార్కెట్లో కొనడం లేదు. మరి ఈ సన్నబియ్యం అమ్మేసుకుంటున్న వారి పరిస్థితి ఏంటనే కదా? కిలోకు రూ. 20 చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్ముకుని.. వాటికి కిలోకు అదనంగా మరో రూ. 20 నుంచి రూ. 30 కలుపుకుని .. మార్కెట్లో దొరికే పాలీష్డ్ ఫైన్ రైస్ను తినే అలవాటును కొనసాగిస్తన్నారు. దీని నుంచి ఇంకా వారు బయటపడలేదు. ఏమన్నా అంటే.. పిల్లలకు, తమకు ఇవి తినడమే అలవాటైందనే కారణం కొందరు చెబితే.. రేషన్ బియ్యంలో మెరిగెలు.. నూకలు ఉంటున్నాయని కొందరు.. అవి ముక్క వాసన వస్తాయని కొందరు.. ఇలా సాకులు చెబుతున్నారు.
బయట మార్కెట్లో విపరీతమైన రేటును పెట్టి కొనడానికే మొగ్గు చూపుతున్న జనాలు.. ఉచితంగా వచ్చే రేషన్ బియ్యాన్ని మాత్రం తినాలనే ఆలోచన చేడయం లేదు. వాటిని అమ్ముకోవాలనే ఆలోచనే చేస్తున్నారిప్పటికీ కొందరు. అయితే ఈ సర్కార్ హయాంలో దాడులు జరగడం.. బియ్యం రవాణా చేస్తూ దొరకడం..లాంటి సంఘటనలు తక్కవే.
తాజాగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆదిభట్ల వద్ద ఓ వెయ్యి క్వింటాళ్ల సన్నబియ్యం పట్టుకున్నారు అధికారులు. రేషన్ దుకాణాల నుంచే ఈ దోపిడీ జరుగుతుంది. అసలు అమ్ముకోవడమే మానేసి ఎంచక్కా ఇవే బియ్యం తింటే.. పేద, మధ్య తరగతి ఫ్యామిలీ బడ్జెట్ కు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది కదా! కానీ అలా చేయడం లేదు..! అంటే మొత్తంగా సన్నబియ్యాన్ని 60 శాతం వరకు తింటున్నారు. ఓ 40 శాతం అమ్మడానికే మొగ్గు చూపుతున్నారు జనం.అంతకు మందు దొడ్డు బియ్యం 60 శాతం అమ్ముకునే వారు. ఓ 40 శాతమే తినేవారు.