బలిజల్లడం.. ఈ పదం గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా వాడేది. అక్కడి వారికి బాగా అనుభవంలో ఉన్నదే. ఇప్పటికే వాడుకలో ఉంటున్న సంప్రదాయం కూడా. దేవతలు, గ్రామ దేవతలకు పూజించే విధానంలో ఓ ప్రధాన ఘట్టం. దుష్ట శక్తులు పోవాలని, గ్రామ దేవతలు శాంతించి, కరుణ, దయ చూపాలనే నమ్మకంతో పశువులను బలి చేసి.. ఆ రక్తాన్ని పసుపు, కుంకుమతో కలిపి దేశాలయాల మీద .. ఊరు చుట్టూ చల్లుతుంటారు.
ఇలా చేస్తే ఇక దుష్టపీడ విరగడై.. అమ్మవారి ఆశీస్సులు మెండుగా దొరుకుతాయనేది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నమ్మకం. ఇదిప్పటికీ కొనసాగుతుంది. ఈ బలిజల్లే విధానం గురించి ఎందుకు టాపిక్.. అంటే..! ఈ పదాన్ని గుర్తు చేసింది సీఎం రేవంత్రెడ్డి గారే. అవును.. ఆయన ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేలా మాట్లాడాడు. అయితే బీఆరెస్ పార్టీని బలి ఇవ్వాలనే ఆయన ఇంటెన్షన్ అయి వుంటుంది. కానీ ఇక్కడ ఇద్దరి పేర్లు తీసుకున్నాడు. కేటీఆర్, హరీశ్రావులవి.
అక్కడే సీఎం ఇరుకున పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. బీఆరెస్ నిరసనలకు ఓ దారి చూపాడు. అసలేం జరిగింది? ఆ పదం ఎందుకు వచ్చింది…? దీనిపై భిన్న కథనాలు కూడా బీఆరెస్ వండి వార్చింది. ప్రశ్నలడిగిన విలేకరుల రక్తం కళ్ల చూస్తానని సీఎం అన్నాడని, కాళేశ్వరంపై సలహాలిచ్చిన రిటైర్డ్ ఇంజినీర్ల రక్తం కళ్ల చూస్తాననే విధంగా కొన్ని కామెంట్లు క్రియేట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి.. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ..ఇది ఆవేశంతో వచ్చిన ఫ్లోలో ఇచ్చిన సమాధానంగా మనం చూడాల్సి ఉంటుంది.
విలేకరులు ఏం అడిగారు? ఎల్నినో వస్తున్నది.. కరువు పరిస్థితుల నేపథ్యంలో నీళ్లు లేకున్నా వరి వేసుకుంటున్నారు.. మరి మీరు కాళేశ్వరం నీళ్లు ఇవ్వడం లేదు కదా.. రైతుల పరిస్థితి ఏంటని? దీనికి సీఎం ఆవేశంగా ఇచ్చిన ఆన్సర్.. వాళ్ల రక్తం పొలాల మీద చల్లితే.. అప్పుడు పంటలు పండుతాయి.. వాళ్ల కొవ్వు ఆ పంటలకు సరిపోతుంది..!అని. అంటే.. మేం ముందే రైతులకు హితబోధ చేస్తూ వస్తున్నాం.. కరువు నేపథ్యంలో.. ఏడు రకాల పంటలే వేయండి.. వీటికి మార్కెట్ డిమాండ్ ఉంటుంది.. ప్రభుత్వం బోనస్ కూడా ఇస్తుందని చెబుతూ వస్తున్నాం .. కానీ బీఆరెస్సే రైతులను రెచ్చగొట్టి వరి ఎక్కువగా వేసుకునేలా ప్రోత్సహిస్తుంది .. అని సీఎం భావన అయి ఉంటుంది.
కానీ ఆ చెప్పే విధానమే హింసాత్మక పదాలు వాడటం వల్ల చర్చకు తెర తీశాయి. దీన్ని అస్త్రంగా తీసుకుని బీఆరెస్ రక్తదానం చేయడం.. ఆ రక్తం ప్యాకెట్లు పట్టుకుని ఊరంతా తిరగడం.. పోలీస్ స్టేషన్లలో ఆ రక్తం ప్యాకెట్లతోనే నిరసన తెలియజేయడం.. ! అబ్బ చెప్పొద్దూ.. రాజకీయంగా ఈ స్థితి మరింతగా దిగజార్చినట్టే అనిపించింది.
కేసీఆర్ చెప్పినట్టే మేం చేస్తున్నామని ఇవాళ కేటీఆర్ ఓ సందర్బంలో అన్నాడు. అంటే ఈ రక్తదానాలు కేసీఆర్ చేయమన్నాడా? కచ్చితంగా అని ఉండడు. ఇదంతా కేటీఆర్ దుందుడుకు డైరెక్షనే అని అర్థమవుతూనే ఉంది. బీఆరెస్ హుందా రాజకీయాలు మానేసింది. కేటీఆర్కు పూర్తి పగ్గాలిచ్చి, కవితను బయటకు వెళ్లగొట్టి.. కేసీఆర్ ఫామ్హౌజ్ కు పరిమితం కావడం.. ఈ నేపథ్యంలో కేటీఆర్ మార్కు రాజకీయం రాష్ట్రంలో మరీ దిగజారినట్టే ఉంటున్నది.
ఆ పార్టీకి ఉన్న అంతో ఇంతో క్రెడిబిలిటీని కూడా తన పంతం కోసం, తన ఆవేశ నిర్ణయాలను అమలు చేయడంలో భాగంగా.. నేను కేసీఆర్ అంత మంచోడిని కాను అని చెబుతూనే దాన్ని నిరూపించుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆత్మబలిదానాల నుంచి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పడు బలిజల్లే రాజకీయాల దాకా వచ్చింది. తెలంగాణ అమరులను పట్టించుకోలేదు. ఉద్యమకారులకూ న్యాయం చేయలేదు. వచ్చిన తెలంగాణలో ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడమే కాక.. జనామోదం పొందే క్రమంలో ఆచితూచి వారి నాడి తెలుసుకుని వేయాల్సిన అడుగులు కాస్తా తడబడుతున్నాయి.
అదీ కేటీఆర్ డైరెక్షన్లో మరీ దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఎంత చేసినా తక్కువే.. అని కామెంట్ చేశాడు కేటీఆర్. మరి కవిత.. ఆ బీఆరెస్ ఖాతాలోని 1400 కోట్లు తెలంగాణ అమరులకు, ఉద్యమకారులకు పంచుమని డిమాండ్ చేశారు కదా.? అంటే.. ఇక మేమేం చేయం.. కాంగ్రెస్ చేయాల్సి ఉంది.. ! అని నెపం నెట్టేసి.. తప్పించుకునే రాజకీయాలకు అలవాటు పడ్డ కేటీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలో తనదైన మార్కు రాజకీయాన్ని బీఆరెస్కు రుద్దుతున్నాడు. ఇది ఎలాంటి ఫలితాలిస్తుందో మరి..