అక్కడ పన్నెండేండ్ల మోడీ ప్రస్థానంపై అహో ఓహో అంటుంటే.. ఇక్కడ పొత్తు పెట్టుకుంటే తప్ప మనం బాగుపడేలా లేమంటున్నారు తెలంగాణ కాషాయదళం. ఇప్పుడీ పొత్తుల గోల ఎందుకు? అంటే.. అమిత్ షా చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. తాము ఎవరితోను ఒక పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే ఎన్నికలకు పోతామని ఆయన తాజాగా ప్రకటించి ఉన్నారు. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూ పోతున్నారు.
అయితే ..వాస్తవ పరిస్థితులను అమిత్ షాకు వివరించే క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను కూడా చెప్పుకుంటున్నారు ఓపెన్గానే. అవును.. మనం పట్టణాల్లో కొంచెం పర్వాలేదు గానీ.. రూరల్లో మరీ పూర్ అమిత్ జీ..! జర ఇది కూడా దృష్టిలో పెట్టుకుని పొత్తుల గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. కేసీఆర్ పథకాలకు అలవాటు పడిన జనం.. ఆయన పేరే జపిస్తున్నారని కొందరు గుర్తు చేస్తున్నారు. ఎలాగూ బీజేపీ ఇక్కడి పార్టీల మ్యానిఫెస్టోలను రీచ్ కాదని వారికి తెలుసు. అసలే అంతంత మాత్రంగా పార్టీ పరిస్థితి. అది సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి రావడం కల్ల. అది అందరికీ తెలిసిపోయింది.
దీంతో వాస్తవ పరిస్థితులు అవగతం చేసుకుని ముందుకు పోతేనే బెటర్ అనే సూచనలు, సలహాలు ఇస్తున్నారు అధిష్టానానికి. తెలంగాణలో ఇప్పటికే ఎవరికి వారుగా నేతలు గ్రూపులు కట్టే విధానంపై విసిగిపోయి ఉన్నారు. ఇటు లీడర్లు.. అటు.. కార్యకర్తలు తెలంగాణలో బీజేపీ అధికారంపై ఆశలు చాలించుకున్నారు. ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులిచ్చినా.. 8 మంది ఎంపీలను ఇక్కడి జనం మోడీ కోసం గెలిపించుకున్నా.. ఈ లీడర్ల ముఖం చూసి ఎవరూ అసెంబ్లీకి ఓట్లెయ్యరనేది వాళ్లు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇవాళ అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడగానే.. తెలంగాణ కమలనాథుల్లో కలవరం మొదలైంది. ఎవరితో పొత్తు లేకుండా పోతే… పరిస్థితి ఎప్పటికీ ఇంతే అనే విషయాన్ని చెబుతూనే.. తెలంగాణలో కేసీఆర్కు ఇంకా జనంలో క్రేజ్ పోలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.
రైతుబంధు లాంటి పథకాలు ఇంకా జనం నుంచి వేరు కాలేవని, వాటిని అమలు చేయడం మూలంగా ప్రజలు కేసీఆర్ పాలన గురించి ఇంకా చర్చించుకుంటున్నారనే విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ పరిణామల కారణంగా బీఆరెస్తో కలిసి వెళ్తేనే మనకు కూడా కలిసి వస్తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే అధిష్టానం మదిలో ఆలోచన మాత్రం వేరుగా ఉంది. వేర్వేరుగా పోటీ చేసినా.. ఆ తరువాత వచ్చిన ఫలితాల ఆధారంగా మద్దతు ఇవ్వొచ్చనే భావనలో ఉంది. బీఆరెఎస్ కూడా సింగిల్గా పోటీ చేస్తుందని, కానీ దానికి సింగిల్గా అధికారం చేజిక్కించుకునే శక్తి లేదని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.
ఓ వైపు కవిత వేరు పార్టీ పెట్టడం.. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం.. ఇవన్నీ చూస్తే… స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాదనే లెక్కలు ప్రస్తుతానికైతే వేసుకుని.. ఆ దిశగా ఆఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆ పార్టీల పరిస్థితేమో గానీ.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సింగిల్గా పోతే.. ఉన్న ఇజ్జత్ పోయే పరిస్థితి వస్తే..! అనే భయంలో ఇక్కడి కమలనాథులు ఉన్నారు. అందుకే ముందుగానే బీఆరెస్తో పొత్తుపెట్టుకుని పోతేనే .. పార్టీకి కలిసి వస్తుందనే హితబోధలు చేస్తున్నారు కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తలు.