ఈ హెడ్డింగ్ పరస్పరం విభిన్నంగా, సంబంధం లేనట్టుగా ఉన్నదనుకుంటున్నారా? పీసీ ఘోష్ కమిషన్పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పిచ్చింది కదా.. మరి బీజేపీ, బీఆరెస్ బంధం మధ్యలో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్కషన్ జరుగుతున్నది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించడంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగతించింది. పనిలో పని సర్కార్ను తిట్టిపోసింది. రెండున్నరేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పీసీ ఘోష్ కమిషన్ పేరుతో సర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయిందని కేటీఆర్ అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పి.. వెంటనే నీటి విడుదల చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. కానీ దీనిపై రాజకీయంగా టర్నింగ్ తీసుకుంటున్నది కాంగ్రెస్. ఇది బలపడుతన్న బీజేపీ- బీఆరెస్ బంధానికి చిహ్నంగా ప్రచారం చేసుకుంటున్నది.
వాస్తవానికి కోర్టు పరిధిలోని ఇష్యూ.. తీర్పు కాబట్టి దానిపై మాట్లాడకుండా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను రాష్ట్ర ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నాయి. తీర్పుకు రెండు రోజుల ముందే హరీశ్ ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది కాంగ్రెస్. స్వయంగా సీఎం రేవంతే ఈ మాటన్నారు. ఇక్కడ బహిరంగ సభ పెట్టుకున్నారు. మరి హరీశ్ను ఎందుకు పంపించారు ఢిల్లీకి. అదీ రహస్యంగా.. ఆరెసెస్ పెద్దలను హరీశ్ ఎందుకు కలిశాడు? అక్కడ తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో.. వాదనలకు ఎలాంటి చాన్స్ లేకున్నా.. ఎందుకు ఇప్పుడు దీనిపై ఢిల్లీలో చర్చిస్తున్నారు? అని అడిగిన ప్రశ్నలు చాలా అనుమానాలు రేకెత్తించాయి రాజకీయంగా. ఆ రోజు జరిగిన జగిత్యాల సభలో కూడా కేసీఆర్ కేంద్రం గురించి, బీజేపీ పార్టీ గురించి పల్లెత్తు మాట అనలేదు. విమర్శలు లేవు. అసలు దాని ఊసే లేదు.
అంతకు ముందే డీలిమిటేషన్- మహిళా బిల్లు విషయంలో దేశవ్యాప్త చర్చ జరిగింది.దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ అనేది గొడ్డలిపెట్టు లాంటిదని దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది.ఏపీలో కూటమి సర్కార్ ఎన్డీయేకు మద్దతిచ్చింది మిత్రధర్మంలో భాగంగా. కానీ బీఆరెస్ మాత్రం దీనిపై తన స్టాండ్ను ఎక్కడా స్పష్టంగా జనాలకు చెప్పలేక పోయింది. లేక లేక ఏడాది తరువాత బయటకు వచ్చిన కేసీఆర్ అయినా.. దీనిపై సభలో చర్చిస్తారని అనుకున్నారు. కానీ దాని దరిదాపుల్లోకి కూడా పోలేదు. రాష్ట్ర బీజేపీకి టచ్ చేయలేదు. ఓ వైపు హరీశ్.. ఆరెసెస్ నేతలను కలిశాడని స్వయంగా సీఎం ఆరోపించడం.. కేసీఆర్ కీలకమైన కేంద్రం నిర్ణయాలు, బీజేపీ పార్టీ ఊసెత్తకపోవడం.. తాజాగా హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే విధించడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కవిత సైతం బీఆరెస్ .. బీజేపీ బంధంపై సెటైర్లు వేశారు. నిలదీశారు.
కేసీఆర్ మహిళా బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కోర్టుల విషయంలో కూడా బీఆరెస్ వేస్తున్న అడుగులు, చేస్తున్న చర్యలు జనానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని నర్మ గర్బంగా ఆ రెండు పార్టీల లైన్లను, విధానాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడిది క్లారిటీ. రేపు రేపు సీబీఐ ఎంక్వైరీ ఏం జరుగుతుందో తన చర్యల ద్వారా ఇప్పటికే కేంద్రం సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు కాళేశ్వరాన్ని పట్టాలెక్కించే పనే మిగిలుంది. ఇది రాజకీయ చట్రంలో ఇప్పుడు ఇరుక్కుపోయి ఉంది.