కాళేశ్వరంపై రగులుతున్న రాజకీయ వేడి.. బీఆరెస్ కన్నా కాంగ్రెస్ సర్కాకే ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పదే పదే సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్లు పెట్టి చెప్పినా.. ఈ అంశాన్ని రైతుల వద్ద తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బీఆరెస్ సక్సెసవుతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టే ప్రధానం.. దాని ఆదేశాల మేరకే నడుస్తామని రేవంత్ క్లారిటీగా చెప్పినా.. మేడిగడ్డే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా పనికిరానవి తేల్చి చెప్పినా.. ఈ వివాదాన్ని ముగించడం లేదు బీఆరెస్.
దీన్ని ఏదో విధంగా రచ్చ చేసి రైతుల ఆమోదం కూడా పొంది.. ఎల్నినో కరువు సాక్షిగా సర్కార్ను దోషిగా నిలబెట్టాలని బీఆరెఎస్ భావిస్తోంది. కాగా, బీఆరెస్ వేసిన ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుతూ వస్తోంది. పావుగా మారుతోంది. ఇటు సీఎం మాట్లాడిన మాటలు.. బీఆరెస్కు అస్త్రాలుగా మారగా.. మధ్యలో దీనిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నేతల తీరుతో మరింత ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటోంది రేవంత్ సర్కార్.
తాజాగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడాడు. కేసీఆర్కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాళేశ్వరం విషయంలో. బీఆరెస్తో కాళేశ్వరంపై చర్చకు సవాల్ అని ఛాలెంజ్ విసిరాడు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం తరుపున వకల్తా పుచ్చుకున్నాడు. కానీ నిబంధనలు వర్తిస్తాయని చివరలో ఓ మెలిక పెట్టాడు.
కండిషన్స్ అప్లై లాగా.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, దీనిపై చర్చించాలని నిబంధన పెట్టాడు. ఇక్కడే పొంగులేటి సవాల్ తుస్సుమన్నది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏంటీ.. రాకపోతే ఏంటీ..? ప్రతిపక్షానికి ధీటైన జవాబిచ్చే క్రమంలో ఇదిగో.. మేమే అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడుతున్నాం.. ప్రజలకు దీనిపై ఇంకా ఏమైనా అనుమానాలున్నా నివృత్తి చేస్తాం…! మీ వైపున మీ అభిప్రాయలను చెప్పడానికి ఆహ్వానిస్తున్నామని.. హుందాగా చేయాల్సిన ప్రకటన.. తమ పార్టీకి, ప్రభుత్వానికి కొంత మైలేజీ ఇచ్చే ఈ సవాల్ అంశాన్ని.. పూర్తిగా తప్పుదారి పట్టించి.. బీఆరెస్కు భయపడినట్టుగానే ప్రకటన చేశాడు పొంగులేటి.
కేసీఆర్ ఎలాగూ రాడు. అది అందరికీ తెలుసు. కేసీఆర్ మాట్లాడాల్సిన టాపిక్.. వారి పార్టీ స్టాండ్.. ఎప్పటికప్పుడు హరీశ్ నోటి వెంట వస్తూనే ఉంది. అసెంబ్లీలో చర్చ పెట్టినా.. కేసీఆర్ మళ్లీ మళ్లీ ఇదే చెబుతాడు. వివరిస్తాడు. కానీ మీకెందుకు కేసీఆర్ వస్తాడా? రాడా? అనే అంశం. కాళేశ్వరం విషయంలో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న స్టాండ్పై తమ మీద తమకే నమ్మకం లేదా? ఇప్పుడు చెబుతున్న విషయాలే మళ్లీ అక్కడా అసెంబ్లీలోనూ అవే చెప్పండి.. కేటీఆర్, హరీశ్రావులకు అవకాశం ఇవ్వండి..! చివరకు అధికార పక్షానికే ఎక్కువ సమయం దొరుకుతుంది.
ఇప్పటికన్నా ఎక్కువ విషయాలు ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించే అవకాశం తీసుకోండి. బీఆరెస్ పిలిచినా రాలేదు.. వచ్చినా మాట్లాడలేదు. మాట్లాడినా జనం కన్విన్స్ కాలేదు. ఇదిగో మేం సర్కార్ పక్షాన మరోమారు ఉన్నదున్నట్టు వివరించి, దీన్ని ఎలా బాగు చేయాలో ఓ ప్రణాళికతో ముందుకు పోతున్నామనే క్లారిటీ కూడా ఇచ్చినట్టవుతుంది కదా?
సర్కార్ అన్నింటికీ రెడీగానే ఉంది కానీ, బీఆరెస్ ఇలా ఛాలెంజ్ విసిరి అలా పారిపోతున్నదని.. సంకేతమిచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉంది. కానీ మధ్యలో కేసీఆర్ వస్తేనే.. అనే కండిషన్.. మీ పిరికితనానికి, మీలో పరిపూర్ణమైన అవగాహన లేదని చెప్పడానికి, కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకు చెబుతున్నదాంట్లో జనాలు అనుమానిస్తున్నది నిజమేనని ఇండైరెక్టుగా ఒప్పుకోవడానికి ఇది కారణమైంది.
అందుకే అంటారు.. ఎవరి పని వాళ్లు చేసుకోవాలని. మధ్యలో ఈ విషయంలో నీ ఛాలెంజ్లు, కండిషన్లు ఎందుకు పొంగులేటి? ఒకవేళ ఈ కామెంట్ సీఎం అనుమతితో చేసి ఉంటాడా? అంటే కచ్చితంగా అయివుండదనే అనిపిస్తుంది. అనుమతితోనే చేసి ఉంటే.. రేవంత్ కూడా బీఆరెస్ వ్యూహంలో చిక్కుకుని బొక్కబోర్లా పడ్డట్టే.
పొంగిలేటి.. ఇంకో రాండ్ స్టెప్ ఏంటో తెలుసా? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఆరెస్ పార్టీ నుంచే నోటీసు రావాలంట…! ఏం మీరే డేట్, టైమ్ ఫిక్స్ చేసి.. రండిరా తేల్చుకుందామని హుంకరించవచ్చు కదా? మళ్లా ఇదేం మెలిక.. తొడలు చరిచి సందులో దాక్కున్నట్టుగా ఉంది..