చెల్లంటే ఎంత కోపముందో.. ఆమెను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకునేందుకు తాజాగా చేసిన ఈ ప్రయత్నమే మరోసారి నిరూపించింది. ఆమె పెట్టుకున్న టీఆరెస్ పార్టీ మాదేనన్నాడు. దీన్ని ఎవరికి కేటాయించొద్దని అన్నాడు. అంతే కాదు.. ఏకంగా 700 మందితో అభ్యంతరాలు తనే పంపించాడు. పేర్లు వేరు.. ప్రాంతాలు వేరు.. కానీ అదే ఫార్మాట్లో వందల అభ్యంతరాలు. ఆ అభ్యంతరాల స్క్రిప్టు తెలంగాణ భవన్ లోనే జరిగాయి. ఎవరెవరు వేశారు ఈ అభ్యంతరాలు..? వారేం చెబుతున్నారోనని లోతుగా పరిశీలన జరిపిన కవిత బృందం షాక్ అయ్యిందట. అవన్నీ మన రామన్ననే పంపాడని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారట. అంటే ఎన్ని ఎక్కువ అభ్యంతరాలుంటే అంతగా ఆమె కొత్త పార్టీని డ్యామేజీ చేయొచ్చని కేటీఆర్ భావించి ఉంటాడు.
అంతే కాదు.. ఓ ఇద్దరు ఎంపీలు.. దామోదరరావు, వద్దిరాజు రవిచంద్ర.. స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిశారంట. అభ్యంతరాలు వ్యక్తం చేశారట. అప్పటికే వారిచ్చిన గడువు ముగిసిందట. అంటే.. ఈ పార్టీ పేరును కవితకు కేటాయించొద్దని కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు. టీఆరెస్ పార్టీ పేరును ఆమె తీసుకుంటుందని కనీసం ఊహించలేకపోయారు కేసీఆర్, కేటీఆర్.
తెలంగాణ జాగృతి పేరుతోనే ఏదో ఒక పార్టీ పెట్టుకుంటారని భావించారు. కానీ కవిత చివరి వరకు దీన్ని రహస్యంగానే ఉంచారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆవిర్భావం రోజున టీఆరెస్ అని ప్రకటించినా.. పేరులో కొంత మార్పు చేసి ప్రకటన చేయడం కూడా ఓ వ్యూహమే. అంటే చివరి వరకు తండ్రీకొడుకుల ఊహకు కూడా అందని విధంగా ఆమె రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు .. అంతిమంగా ఆమె అనుకున్నది సాధించేలా చేశాయి.
లేటుగా తేరుకున్న కేటీఆర్.. గింగిరాలు తిరుగుతూ.. గగ్గోలు పెడుతూ ఎన్ని అభ్యంతరాలను తనే స్వయంగా ఏర్చి కూర్చి వండి వార్చి పంపినా.. అక్కడ అవి చెల్లుబాటు కాలేదు. ఆమె పక్కా ప్లానింగ్ ప్రకారం.. నిబంధనలను అనుసరించే ముందుకు సాగారు. దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి ప్రతీ అడుగు ఆమె ఒకటికి రెండు సార్లు ఆలోచించే .. అనుభవజ్ఞుల సలహాలు తీసుకునే ముందుకు సాగారు. పార్టీ పేరును ఇప్పుడు ఎవరు కాదన్నా.. ఎవరికి ఇష్టం లేకున్నా.. కవితకే దక్కింది. ఇక టీఆరెస్ను బీఆరెస్ మరిచిపోవాల్సిందే.
మమ్మల్ని ఇంకా జనాలు టీఆరెస్గానే గుర్తిస్తారు.. అని కమిషన్కు లేఖ రాసిన కేటీఆర్.. మరి ఆ పేరెందుకు మార్చారో జనానికి వివరించారా? వారి మద్దతు మీకు ఉందా? తెలంగాణ లేకుండా చేసుకుంటున్నామనే సోయి లేకుండెనా? అప్పుడంతా ఓ ట్రాన్స్లో ఉన్నారు. ఇప్పుడు తేరుకున్నా.. ఫలితం అనుభవిస్తున్నారు. పశ్చాత్తాపం మాత్రం లేదు.. అని అనుకుంటున్నారు గులాబీ నేతలే కొందరు.