హైడ్రా వద్దని ఒకరు.. అది ఆగదు.. బుల్డోజర్లు నడుస్తనే ఉంటయని మరొకరు.. ఇలా రాష్ట్ర రాజకీయంలో రంగనాథ్ ఇష్యూ.. హైడ్రా నేపథ్యం ఇప్పుడు తీవ్ర చర్చకు తెరతీస్తున్న వేళ.. ఓ కొత్త కోణం కూడా ఇప్పుడు వెలుగు చూస్తోంది. గతంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నాడు.. జిల్లాలకూ విస్తరిస్తాం హైడ్రాను అని. దీనిపై పెద్దపల్లి వేదికగా బహిరంగ సభలో మొన్న కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు దీనిపై.
హైడ్రా అందానికి ఇక జిల్లాలు కూడా విస్తరిస్తారట అని. ఇదిలా ఉంటే.. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే.. జిల్లాల్లో ఈ హైడ్రా బుల్డోజర్లు రావాలని కోరుకుంటున్నారట. పదేండ్ల పాలనలో ఎమ్మెల్యేలు బాగా తిష్ట వేసుకు కూర్చుని .. ప్రభుత్వ స్థలాలను, నాలాలను, రోడ్లను.. కబ్జా పెట్టిన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
జనాలు కూడా వీరి చేష్టలకు విసిగిపోయి ఓడించారు. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్కు కూడా తెలుసు. కానీ వారిని మార్చి ఇంకొకరి పెట్టే వ్యవస్థ అక్కడ ఏర్పడలేదు. ఇంకొకడిని ఎదగనీయలేదు. అంతా మీరే.. మీరే సుప్రీమ్ అంటూ వారిని ఆకాశానికెత్తి వదిలాడు కేసీఆర్. అదే ఆయన కొంప ముంచింది.
ఒకటి కాదు రెండు కాదు… వరుసగా మూడు సార్లు ఇచ్చిన వారికే టికెట్లు ఇవ్వడం మూలంగా బలవంతంగా ఆ దరిద్రాన్ని మా మీద రుద్దుతున్నారనే ఫీలింగుకు వచ్చేశారు జనం. దీంతో కేసీఆర్ ముఖం చూడలేదు… ఎవరినీ లెక్క చేయలేదు… ఓడించాలంటే ఓడించాలి.. అంతే..! ఫలితాలు బెడిసికొట్టాయి. కేసీఆర్ ఫామ్హౌజ్కు పరిమితమయ్యాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఈ పదేండ్ల పాలనలో విపరీతమైన అవినీతికి తెరతీశారు బీఆరెస్ ఎమ్మెల్యేలు. కబ్జాలకు లెక్కలేదు. ఇక మాకు తిరుగే లేదనే విధంగా.. కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రానికి ఎవడూ దిక్కేలేడు అనే ధీమాతో ఆడింది ఆట పాడింది పాటగా సాగింది వీరికి. ఇప్పుడు ఈ కబ్జాల బాగోతంపై చర్చ జరుగుతోంది.
హైదరాబాద్లో హైడ్రాకు సర్కార్ బలమైన సపోర్టు ఇవ్వడంతో ఇక దీనికి తిరుగులేదనే విషయం జనాలకు తెలిసిపోయింది. రంగనాథ్ లాంటి నిజాయితీ ఆఫీసర్ను కాపాడుకోవడం వెనుక సర్కార్ సదుద్దేశ్యమూ అర్థమైపోయింది. ఇక జిల్లాలకూ దీన్ని విస్తరించడం మూలంగా.. పదేళ్ల రాజకీయ అవినీతి కబ్జాలకు ఓ గుణపాఠం చెప్పినట్టవుతుందనే భావన వచ్చింది రూరల్ ప్రజలకు.
అందుకే మా జిల్లాకు హైడ్రా రావాలె.. మాకూ కావాలె.. అంటూ సర్కార్కు వినతులు వస్తున్నాయట. వాస్తవానికి, ఇప్పటి వరకు ఏ జిల్లాకు కూడా దీన్ని విస్తరించలేదు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చిన ఘటన హైడ్రాకు సంబంధం లేనిది. ఇక ఇది ఇప్పుడే జిల్లాలకు విస్తరిస్తారా? రెండో టర్ము అధికారంలోకి వచ్చిన తరువాత ఆలోచిస్తారా? తెలియదు. కానీ హైడ్రాకు మాత్రం మంచి డిమాండ్ పెరిగింది. అక్రమార్కుల పైకి ఎక్కుపెట్టిన అస్త్రంగా దీన్నిపరిగణిస్తన్నారు జనం.