మబ్బుల్ని చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోవద్దు..! అంటారు పెద్దలు. ఇప్పుడు అదే చేస్తున్నారు రైతులు. ఓవైపు ఎల్నినో కరువు రక్కసి కోరలు చాచుకుని కాచుకు కూర్చున్నది. ఇప్పటి వర్షాలు లేట్ అయ్యాయి. ఇప్పుడు సమృద్ధిగా కురియడంతో ఇక నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.. మొన్నటి వరకు వేచి చూసిన రైతాంగం.
గత ఏడాది ఈ సీజన్లో ఇప్పటికే 80 శాతం నాట్లు పడ్డాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సకాలంలో వర్షాలు లేక 30 శాతానికి మించి నాట్లు వేయలేదు రైతులు. ఇంకా పుటాల్లోనే నార్లు వెయిట్ చేస్తున్నాయి… వర్షాల కోసం. బోర్లు, కాలువలు, చెరువల వద్ద ఉన్న సాగు మాత్రం ముందుకు పోతున్నది. మిగిలిన చోట్ల పుటం వేసి ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఇక రైతులు కరువు గిరువు జాన్తానై అని నాట్లకు రెడీ అయిపోయాడు. కానీ వ్యవసాయాధికారులు, సర్కార్ కూడా లబోదిబో మొత్తుకుంటున్నది. వరి వేయొద్దని. కానీ రైతులు మాత్రం వినడం లేదు. పెద్దల మాటలు పెడచెవినే పెడుతున్నారు. పుటాలతోనే ఆపితే కొంత నష్టంతోనే సరిపెట్టుకోవచ్చు.
కానీ నాట్లు వేసి వరి సాగు చేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందంటున్నారు నిపుణులు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు. ఇప్పుడు మురిపించి ఆ పై మరిపిస్తాయంటున్నారు ఈ వానలు. ఈ రెండు నెలలు ఏమి సాగు చేయకుండా పడిత్గా భూమిని ఖాళీ అయినా పెట్టండి.. కానీ వరి వేయొద్దు.. రెండో పంటకు రెడీ చేసుకోండి.. అని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు.
అయినా వినడం లేదు. ఇప్పుడు నాట్లు వేస్తే ముదురు నారు వస్తుందని, దీని కోసం అధిక డోసు యూరియా, భాస్వరం,మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందని, అయినా అకాల వర్షాల వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు. ఆరుతడి పంటలకు కూడా ఇప్పుడు అవకాశం లేదు. కందులు తప్ప.. వేరే ఏ ఆరుతడి పంటలు కూడా వేసుకునే వాతావరణం ఇప్పుడు లేదు.
ఒకవేళ కచ్చితంగా వరి సాగు చేసుకోవాలని రైతులు డిసైడ్ అయితే మాత్రం.. ఓ ఐదెకరాలు ఉన్న రైతు రెండు ఎకరాలకే పరిమితం కావడ బెటర్ అని సూచిస్తున్నారు. కానీ రైతులు వినేలా లేరు. వరి వేసేందుకే రెడీ అయ్యారు. నష్టం జరుగుతుందని అని తెలిసినా. కరువు కాటేస్తుందనే భయం వెంటాడుతున్నా..