Harish Rao: తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘రాసుపెట్టుకోండి.. మళ్లి వచ్చేది కారే, కేసీఆర్ సర్కారే’ అంటూ సవాలు విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలోని ఓ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే కార్యకర్తలే తమకు దేవుళ్లు అని హరీష్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలను తెస్తే రేవంత్ రెడ్డి లేనిపోని ఆశలు పెట్టారని హరీశ్ రావు అన్నారు. ప్రజలు కృతజ్ఞతతో ఓట్లు వేస్తారని భావిస్తే.. రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో ప్రజలు చిక్కుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని.. రేవంత్ వచ్చాక రైతు బంధు మొత్తం ఎగ్గొట్టారని ఆరోపించారు. మరోవైపు ఈ ప్రభుత్వంలో ఎరువుల కష్టాలు కూడా బాగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ 11 గంటలే కరెంట్ ఇస్తోందని మండిపడ్డారు.
రైతు డిస్కం అమలులోకి వస్తే ఇప్పుడొచ్చే 11 గంటలు కూడా రైతులకు కరెంట్ రాదని హరీశ్ రావు హెచ్చరించారు. 5, 6 గంటలు మాత్రం వస్తుందని పేర్కొన్నారు. రైతు అనేవాళ్లు ఇక కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ‘రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.. నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు’ అని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదని రేవంత్ అంటున్నారని.. వచ్చే ఎన్నికల తర్వాత పాలకపక్ష హోదా రాబోతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు గుర్తుపెట్టుకో అంటు రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.
Also Read: కాంగ్రెస్లో అంతర్గత పోరు.. షబ్బీర్ అలీపై మహిళా నేత ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు!
రాష్ట్రంలో ఎక్కడ చుసినా ‘కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలె’ అంటున్నారని హరీశ్ రావు అన్నారు. చాలా మంది BRS కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని.. అయినా కూడా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ మాట్లాడితే బూతులే వస్తున్నాయని.. ఆ మాటలకు ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు. ఈ ధ్వని కాలుష్యం పోవాలంటే రేవంత్ కు బుద్ది చెప్పాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మంచి రోజులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: 10 సార్లు సర్వీస్ చేసినా నో ఛేంజ్.. యజమానికి రూ. 88 వేలు రీఫండ్ ఇవ్వాలని కోర్టు తీర్పు!