బీఆర్ఎస్ పార్టీలో ‘కాళేశ్వరం’ తీర్పు జోష్ నింపినట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఆ పార్టీ నేతలు, కేడర్ హర్షం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తప్పుడు నివేదిక రెడీ చేయించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును అరెస్టు చేయించాలని చూసిందని.. కోర్టు తీర్పుతో రేవంత్ సర్కారుకు కనువిప్పు కరిగిందని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ట్రై చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కుట్రను న్యాయస్థానం పటాపంచలు చేసిందని గుర్తుచేస్తున్నారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికలో ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుదే అని తేల్చింది.దాదాపు ఏడాదిన్నర విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్..కేసీఆర్, హరీశ్ రావులను విచారించాక వారే బాధ్యులుగా తేల్చింది.అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్, హరీశ్ రావు మీద క్రిమినల్ చర్యల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో బీఆర్ఎస్ తరఫున హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు.సుదీర్ఘ విచారణ అనంతరం కాళేశ్వరం కమిషన్ నివేదికను కోర్టు తప్పబట్టింది. విచారణలో పారదర్శకత లోపించిందని బీఆర్ఎస్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో ఈ నివేదిక మేరకు కేసీఆర్, హరీశ్ రావును అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ నివేదికను కొట్టివేయాలని బీఆర్ఎస్ కోరగా.. అందుకు న్యాయస్థానం అనుమతించలేదని తెలుస్తున్నది.
కాళేశ్వరం కమిషన్ మీద న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. అలా చేయడం వలన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని, కావాలనే రేవంత్ సర్కార్ తమ మీద బట్టకాల్చి మీద వేస్తున్నదని ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు పాటిజివ్ రియాక్షన్ వచ్చింది.
వేలాదిగా జనం తరలిరావడంతో క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు సడలలేదని గులాబీ అధినేత కేసీఆర్.. సీనియర్లకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉండటంతో ఇక మీదట వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని చూస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.
కాళేశ్వరం కమిషన్ నివేదిక వన్ సైడ్ ఉందని హైకోర్టు తీర్పు నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే మరోసారి అప్పీల్ చేయనుందా? లేదా సుప్రీం గడప తొక్కుతుందా? తెలియాల్సి ఉన్నది. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇదిలాఉండగా, బీఆర్ఎస్ సైతం సర్కారు తీసుకునే చర్యల ఆధారంగా సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించేందుకు వెనుకాడటం లేదని తెలుస్తున్నది.ఇకమీదట ఏ ఎన్నికలు వచ్చినా సర్కారు కుట్రలను ప్రజల ముందు ఉంచాలని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే స్థానిక ఎన్నికలు ( ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, ఆ దిశగా పనిచేయాలని కేడర్కు గులాబీ అధినాయకత్వం సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.