తాము అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి అవతల పారేస్తామంటున్నారు కేసీఆర్, కేటీఆర్. ఇప్పుడు ఈ డిస్కషన్ మళ్లీ సీరియస్గా నడుస్తోంది. ఓ వైపు సర్కార్ దీనిపై గట్టి పట్టు మీద ఉంది. దీన్ని నిర్వీర్యం చేయాలని, చెడు ప్రచారాలకు సైతం దిగుతున్న బీఆరెస్పై మండిపడుతూనే హైడ్రాను మరింతగా స్ట్రాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది రేవంత్ సర్కార్.
అయితే ఇదే సమయంలో మళ్లీ తమ పాత నినాదాన్ని బలంగా వినిపిస్తోంది బీఆరెస్. కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా… ఇదో విధ్వంసక కార్యక్రమం… హైడ్రాను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు.. దీన్ని పీకి అవతల పాడేస్తాం.. మేం అధికారంలోకి రాగానే తొలగిస్తాం.. అనే మాటలు బలంగా మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు టీమ్ కూడా ప్రెస్నోట్లు, ప్రెస్మీట్లు.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా హైడ్రా అంటేనే జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ జనాల నుంచి బీఆరెస్ అనుకునే ఫీడ్ బ్యాక్ రావడం లేదు. ఇదే ఇప్పుడు బీఆరెస్కు మింగుడు పడని అంశంగా మారింది. కొన్ని చోట్ల హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు తీయడం కూడా జనామోదం దీనికి ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది. దీనికి తోడు జిల్లాలకు కూడా హైడ్రా విస్తరించాలనే డిమాండ్ మెల్లగా ఎక్కువవుతోంది. సర్కార్కు దీనిపై వినతులు వస్తున్నాయి. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో కూడా జనాలకు ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయన నిజాయితీని శంకించే పరిస్థితుల్లో జనం లేరు. ఆయనకున్న ట్రాక్ రికార్డు కూడా అలాగే ఉంది.
దీనికి తోడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత.. కోర్టు కంటెంప్ట్ అనే అంశంలో సోమేశ్కుమార్పైన కూడా ఓ 400 కేసులు ఉన్నాయని గుర్తు చేయడం మూలంగా.. సర్కార్ కొన్నిచర్యలు తీసుకునేక్రమంలో కోర్టు కు వ్యతిరేకంగా పోతున్నామనే విధంగా ఫిర్యాదులు రావడం సహజమేననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించినట్టయ్యింది. దీంతో రంగనాథ్ ఏదో చేయరాని నేరం చేశాడని, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని బీఆరెస్ ప్రొజెక్ట్ చేద్దామనుకున్నా.. అది చెల్లుబాటు అయినట్టుగా లేదు.
దీంతో దీనిపై అన్నమాటకే కట్టుబడాలా? అలాగే మొండిగా పోతే జనం రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే విషయంలో బీఆరెస్ తర్జనభర్జన పడుతోంది. అయినా ముందుకే పోదాం.. దీన్ని గట్టిగా వ్యతిరేకిద్దాం అనే భావనలోనే కేటీఆర్ ఉన్నాడు. కానీ పదేళ్లలో నాలాలపై ఒక్క ఆక్రమణ కూడా తొలగించని కేసీఆర్ పాలనలో సిటీలో చిన్నపాటి వర్షాలకు మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెద్ద వానలు పడితే గంటలు గంటలు నరకం అనుభవించాలి.
మొన్నటికి మొన్న కూడా ఇదే పరిస్తితిని సిటీ జనం అనుభవించారు. కానీ దీనిపై కేటీఆర్ ఉల్టాచోర్ కొత్వాల్కు డాంటే .. అన్నట్టు సర్కార్పై విరుచుకుపడ్డాడు. విమర్శల పాలయ్యాడు. కానీ ఇప్పుడు హైడ్రా ఈ విషయంలో కూడా రంగంలోకి దిగింది. వర్షాలు పడితే చాలు .. హైడ్రా టీం సిటీ రోడ్ల మీద ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ స్తంభించినా.. రోడ్లపై నీళ్లు నిలిచినా చర్యలుంటాయని సీఎం రేవంత్ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిటీ పరిస్థితి మారుతోంది.
ఓ వైపు ఆక్రమణల తొలగింపు.. నాలాల క్లియరెన్స్, సిటీ రోడ్లపై వాన నీరు స్తంభించకుండా సత్వరం చర్యలు తీసుకునే విషయంలో హైడ్రా ముందుంటుంది. అదే ఇప్పుడు కీలకంగా మారింది. అందుకే బీఆరెస్ లేవనెత్తిన పీకి అవతల పాడేస్తాం.. అనే నినాదానికి బలం చేకూరడం లేదు.