కవిత ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కీలకమైన భారీ సాగునీటి ప్రాజెక్టు మీద. ఓవైపు కాళేశ్వరం.. కూలేశ్వరంగా మారిందని రేవంత్ సర్కార్ .. కేసీఆర్ను దోషిలా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇది పనికిరాదని రెండేండ్లు కాలయాపన చేసిన సర్కార్.. తుమ్మిడిహట్టి వద్ద కడుతామని పంతానికి దిగింది. ఇప్పుడు కాళేశ్వరం రిపేర్లు అంటున్నది. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల పథకానికి 152 మీటర్ల ఎత్తు అవసరం.. కానీ మహారాష్ట్ర సర్కార్ దీనికి ఒప్పుకోవడం లేదని కారణాలు చెబుతోంది. పనిలో పని కిషన్రెడ్డి కూడా అక్కడి సీఎంతో మాట్లాడటం లేదని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇన్ని గందరగోళాల నడుమ, రైతులు అయోమయంలో దిక్కు తోచని స్థితిలో ఉండగా.. కవిత తొలిసారి తన కొత్త పార్టీ టీఆరెస్ గొంతుకగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
148 మీటర్ల ఎత్తుతో కట్టుకోవడానికి అన్ని అనుమతులున్నాయి. కవిత ఇప్పుడు దీనికి ఓకే అనడమే ఇక్కడ చర్చకు తెర తీసింది. వాస్తవంగా, ఈ 148 మీటర్ల ఎత్తు విషయంలో అప్పటి కాంగ్రెస్ అంగీకరించలేదు.. కేసీఆర్ కూడా ఈ ఎత్తు సరిపోదు.. వర్షాలు లేని సమయంలో ఇక్కడ నీటి ఉధృతి లేకపోతే.. సరిపడా నీళ్లను ఎత్తిపోసుకోలేమన్నాడు. అందుకే దీన్ని మేడిగడ్డకు మార్చడం.. అంచనాలు పెంచడం.. అది ఏకంగా లక్ష కోట్లకు చేరడం… అంతా చకచకా జరిగిపోయింది.
ఇప్పుడు రేవంత్ సర్కార్ మళ్లీ కొత్త పాట అందుకున్నది. తుమ్మిడిహట్టి వద్దకు వచ్చాడు. ఇక్కడే కడుతామంటున్నాడు. మళ్లీ పాత కథే వినిపిస్తున్నాడు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒప్పుకోడు. ఆ విషయం కేసీఆర్ టీమ్ కూడా ఇప్పుడు చెబుతూ వస్తోంది. ఒకవేళ ఒప్పుకున్నా కేసీఆర్ టైమ్లోనే ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే.. మోడీకి, కేసీఆర్కు మధ్య ఆదిలో మంచి సంబంధాలుండే. ఇక కవిత ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ 148 మీటర్ల ఎత్తు సరిపోతుందనే వాదన తీసుకురావడం.. సర్కార్ను డిఫెన్స్లో పడేయడమే అవుతుంది.
చిత్తశుద్ది ఉంటే ఇదే ఎత్తుతో కట్టి తీరాలె అని కవిత తన పార్టీ డిమాండ్గా ముందుకు తీసుకురావడం ఇక్కడ కొత్త అంశం. ఇంకో ముఖ్యమైన విషయం.. ఆమె కనీసం కాళేశ్వరం గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇప్పుడు పడావు పడి ఉంది. దీన్ని రిపేర్ల పేరుతో మరింత కాలయాపన చేయనున్నారు. మధ్యలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ కవిత దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఆమె గతంలోనే ఆరోపించారు.. హరీశ్రావు దీంట్లో భారీ అవినీతికి తెరలేపాడని.
అందుకే అక్కడ ఫిల్లర్లు కుంగాయని. అంటే.. ఆమె ఉద్దేశ్యం కూడా కాళేశ్వరం ఇక పనికిరాని ప్రాజెక్టేనని. ఇప్పుడు తుమ్మిడిహట్టి ప్రధాన కేంద్ర బిందువుగా రాజకీయం మొదలైందనే చెప్పాలి. రెండు దశాబ్దాలుగా రాజశేఖర్రెడ్డి టైమ్ నుంచి ఇప్పుడు రేవంత్రెడ్డి దాకా.. ఎవరూ దీనిపై ముందడుగు వేయలేదని, అందరినీ వరుసబెట్టి మరీ విమర్శలు గుప్పించడంతో ఇది కొత్త చర్చకు తెరతీసింది.
ఓవైపు నిధులే లేవని సర్కార్ చెబుతూ.. తుమ్మడిహట్టిపై పర్మిషన్లు రావడం లేదనే కాలయాపన నడుమ.. కాళేశ్వరం రిపేర్ల పేరుతో సాగదీత మధ్య రైతుల దీనగాధలకు కవిత వాదన కూడా తోడైంది. ఆమె ఇప్పుడు సర్కార్ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు తుమ్మిడి హట్టిని ప్రధానంగా చర్చలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా ఆమె దీనిపై మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఇది కొత్త రాజకీయాలకు కేంద్ర బిందువు కానుంది.