మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పొలిటికల్ టెన్షన్స్ కంటే ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ అయినట్టు తెలుస్తోంది.ఆయన ప్రస్తుతం పార్టీ మీద ఫోకస్ పెట్టాలా? లేక కుటుంబం మీద ఫోకస్ పెట్టాలా? తెలియని అయోమయంలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. పదవులు, పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయని.. కూతురు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన ఉద్యమంలో కవిత, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్, మరికొందరు వీరి కుటుంబం నుంచి పోరాటాలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా.. కేటీఆర్ మంత్రి, హరీశ్ రావు మంత్రి, కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఒకే ఒక్క కారణంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. కేటీఆర్, హరీశ్ రావులను కేబినెట్లోకి తీసుకున్నారు. బిడ్డను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే కల్వకుంట్ల కేబినెట్ అవుతుందని ముందే భావించారేమో తెలిదు. అందుకే కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇక జోగినిపల్లి సంతోష్ కుమార్ను రాజ్యసభకు పంపించారు. అప్పటికే కేసీఆర్ ప్రభుత్వంలో వారసులు భాగస్వామ్యం పంచుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేసీఆర్ది కుటుంబ పాలన అని.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి.
తొలిటర్ములో కేసీఆర్ పాలన, సంక్షేమం ప్రజలను మెప్పించింది. దీంతో మరోసారి గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే,కొంత వ్యతిరేకత కూడా కనిపించింది. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా రెండోసారి కవిత పోటీ చేయగా.. స్థానికంగా ఆమె మీద వ్యతిరేకత పెరిగింది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో ఆమె విఫలమయ్యారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేయగా..నాడు స్థానిక ఎంపీగా ఉన్న కవిత ఏం చేయలేకపోయారు. దీంతో కవితకు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ గుర్తు మీద ధర్మపురి అర్వింద్ గెలిచారు. ఓటమి బాధను భరించలేక కవిత కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి సీఎం, సోదరుడు కేటీఆర్ మంత్రిగా, హరీశ్ రావు సైతం మంత్రిగా ఉన్నారు. తనకు పదవి లేదని కవిత బాధతో ఉండగా.. ఆమెను నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించారు కేసీఆర్..
Monthly Horoscope: మే నెల రాశి ఫలితాలు : ఆ రాశి ఉద్యోగులకు లాభాలు – రియల్టర్స్ కు నష్టాలు
తమ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఓ వైపు కేటీఆర్, మరోవైపు కవిత.. హరీశ్ రావులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. తీరా 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చింది. అందులో కవిత నిందుతురాలిగా సీబీఐ ఆమె మీద అభియోగం మోపింది.ఈ క్రమంలోనే ఆరు నెలల పాటు ఆమె తిహార్ జైలులో నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడిపారు. ఇక బెయిల్ మీద బయటకు వచ్చాక బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ధిక్కార స్వరం పెంచారు. ఆ తర్వాత సొంత పార్టీ, సోదరుడు, బావ మీద అవినీతి ఆరోపణలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఈ విషయం కేసీఆర్ను తీవ్రంగా బాధిస్తుందని తెలుస్తోంది.కాగా, పదవులు, పంపకాల్లో తేడాలు వచ్చాయని సొంత తండ్రిని కవిత తిట్టడం మంచి పద్ధతి కాదని.. ఆయనే లేకుంటే కేటీఆర్, కవితకు పదవులు వచ్చేవా? అని అధికార పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం విమర్శించిన విషయం తెలిసిందే.