ఎప్పటికైనా కేటీఆర్ను సీఎం చేయాలనేది కేసీఆర్ జీవిత లక్ష్యం. ఆ విషయం చాలా సార్లే చెప్పాడు కూడా సన్నిహిత వర్గాల దగ్గర. తాను మొదటి టర్ము సీఎం అయిన తరువాత కొద్ది కాలానికే జనం ముందుంచే ప్రయత్నం చేశాడు కేటీఆర్ను. జిల్లాల వారీగా ప్రజా ఆశీర్వాద సభ పేరిట.. బహిరంగ సభలు నిర్వహించాడు. సందర్భం, ఓ నేపథ్యమేమీ లేదు ఆ సభలకు. కేవలం కేటీఆర్ను జనం రిసీవ్ చేసుకుంటున్నారా? లేదా? ఎట్లా మాట్లాడుతున్నాడు? రేపు సీఎం క్యాండిడేట్గా జనం అంగీకరిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం.. జనానికి మెల్లగా ఇంజెక్టు చేసి రాబోయే, కాబోయే సీఎంగా ప్రచారం చేయించడం.. ఇవన్నీ ఒక క్రమ పద్దతిలో చేస్తూ పోయాడు.
అప్పుడున్న ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించాడు కేసీఆర్. కానీ కుటుంబంలోనే ముసలం పుట్టి కేసీఆర్ ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టాయి. ఆ తరువాత ఆ కోరిక నెరవేరనే లేదు. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన తప్పిదం నేను చేయను.. రాహుల్ను పీఎం చేసి ఉంటే.. ఇప్పుడాయన మాజీ ప్రధాని హోదాలో జనంలోకి వెళ్లేవారు. కానీ ఆ అవకాశాన్ని ఆమె జార విడుచుకున్నారు.. అని పలు సందర్బాల్లో తనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో చెప్పారట కూడా. కానీ కేసీఆర్కు కూడా అది కుదరలేదు. మళ్లీ ఆయన అదే ప్రయోగాన్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే వరంగల్ రైతుసభకు కేటీఆరే ముఖ్య నేత. కేసీఆర్ లెవల్లో ఓ సభకు అట్రాక్షన్గా ఉండి మాట్లాడుతారన్నమాట.
కేసీఆర్ అన్ని సభలకు రాకున్నా.. కేటీఆర్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు.. సీఎంగా కూడా సెట్ అవుతాడు.. అనే భావన నేతల్లో , ప్రజల్లో తీసుకెళ్లడమే కేసీఆర్ వ్యూహం. బీఆరెస్ అధికారం కోల్పోయిన తరువాత.. పూర్తిగా పార్టీ పగ్గాలు కేటీఆర్కే ఇచ్చాడు. నిర్ణయాధికారాలు కూడా. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేటీఆర్కు ఇదో మంచి అనుభవ పాఠాలు నేర్పుతాయనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో కేటీఆర్ విఫలమయ్యాడు. తనదైన దుందుడుకు శైలి, పొగరుబోతు మాటలతో.. హుందాతనం లేని ప్రసంగాలతో పలుచనే అయ్యాడు.
సబ్జెక్టు వారీగా మాట్లాడి..అదే స్థాయిలో విమర్శలు లేకపోగా.. తనేం తక్కువ తినలేదనే దోరణిలో పరుషంగా మాట్లాడే పద్దతిని ఎంచుకున్నాడు. దీనికి కొంత ఓటమి ఫ్రస్టేషన్ కూడా తోడయ్యింది. అధికార పక్షం మీదే కాదు.. స్వపక్షం నేతలను, పనిలో పని జనాన్ని కూడా తిట్టడం మొదలు పెట్టాడు. ఇక ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇప్పుడు సమయం ఆసన్నమైందని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు. అందుకే కీలక సభలకు కేటీఆర్ను ముఖ్యనేతగా పంపుతున్నాడు. ఇలా ఎన్నికల సమయానికి కేటీఆర్ను జనం, తమ పార్టీ నేతలు అంతా సీఎం క్యాండిడేట్గా ఓన్ చేసుకుని, అంగీకరించి.. కలుపుకుని పోవాలనేది కేసీఆర్ రాజకీయ వ్యూహంగా చెబుతున్నారు.
అంటే.. కేసీఆర్ ఫామ్హౌజ్లో నుంచి ఇవన్నీ గమనిస్తారన్నమాట. సమావేశాల తరువాత పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది? ఇంకా మార్పులేం చేసుకోవాలె? కేసీఆర్ ప్రసంగంతో పోల్చితే.. కేటీఆర్ ప్రసంగం ఆకట్టుకుంటుందా? జనం ఎలా ఫీలవుతున్నారు? ఈ ఫీడ్ బ్యాక్ అంతా తీసుకోనున్నారు. కేసీఆరే సీఎం అని చెబుతూ ఉంటారు. పరిస్థితి తమ చేతిలోకి రాగానే గతంలో చేసిన పొరపాటు చేయకుండా వెంటనే కొడుకును సీఎం పీఠం ఎక్కించాలనేది కేసీఆర్ తపన. తండ్లాట.