కేసీఆర్ తను ఏం చేసినా చెల్లుబాటవుతుందనుకుంటారు. తెలంగాణ కోసమేనని జనం నమ్మేలా చేసుకుంటాడు. జనం కూడా నమ్మారు కొద్ది రోజుల పాటు. ఆ తరువాత మెల్లగా తేరుకున్నారు. నిజాలు తెలుసుకున్నారు. తెలంగాణ కోసం తండ్లాడినోడు కదా అని కొంచెం ఓపిక పట్టారు. కానీ జనం మరీ గొర్రెలనుకున్నారు. ఇప్పుడీ ముచ్చటెందుకంటే…! చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ నోటి వెంట.. తెలంగాణ పునర్నిర్మాణము, పునరేకీకరణ అనే మాటలొచ్చాయి. తను అధికారంలో ఉన్నప్పుడూ ఈ మాటలొచ్చాయి. రాజకీయ పునరేకీకరణ పేరుతో మొత్తం ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నం చేశారాయన.
ఇదంతా తెలంగాణ కోసమేనన్నారు. జనం కూడా నమ్మారు. అసెంబ్లీలో తను మాట్లాడింది తలాడిస్తూ వినేవాళ్లే ఉండాలె తప్ప.. నోరు విప్పి మాట్లాడేవాళ్లు, నిలదీసేవాళ్లు, ప్రశ్నించేవాళ్లు ఎవరూ ఉండొద్దు. ఇదీ కేసీఆర్ మెంటాలిటీ. ఆయన తనకు తానుగా జాతిపితగా సర్టిఫికెట్ ఇప్పించుకోబడిన నేత. అందుకే ఆ పిత నోరు విప్పి చెప్పిన ప్రతీ మాట ఆణిముత్యమే. తెలంగాణ జాతి హితమే. చేసే ప్రతి కార్యమూ ఇక్కడి జనం మేలుకోసమే. తీసుకున్న ప్రతి నిర్ణయమూ బంగారు తెలంగాణ కోసమే. జనం బాగు కోసమే. అంతే అనుకోవాలె. అయితే సెంటిమెంటు లేకపోతే నియంతపోటు.. ఇదే కేసీఆర్కు తెలిసింది.
తెలంగాణ సెంటిమెంట్ను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన లీడర్. జనాన్ని ఎలా నమ్మించాలో కూడా గుర్తెరిగిన నేత. ఇప్పుడు మళ్లీ పునరేకీకరణ అంటున్నారు కేసీఆర్. పునర్నిర్మాణ మహాయజ్ఞం అంటున్నారు. బీఆరెస్ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ పునర్నిర్మాణం జరగదు. కేసీయారో, కేటీయారో సీఎం అయితే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదు. ఇదే చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్. ఈ విషయాన్నే ఇంజెక్టు చేశారు జనాల్లో చాలా కాలం పాటు. ఇప్పుడీ మందు పనిచేయడం లేదు. కానీ అధికారంలోకి రావాలంటే మళ్లీ ఏదో ఒకటి చేయాలె. జనాన్ని నమ్మించాలె. అందుకే మళ్లీ అదే పాత రాగమందుకున్నారు. పునరేకీరణ.
ప్రతిపక్షం లేకుండా చేసి కొత్త రాజకీయాలకు నాంది పలికిన కేసీఆర్… ఇప్పుడు ఈ రాజకీయ పునరేకీరణ పేరుతో జీవన్రెడ్డి లాంటి నేతలను లాగుతాడన్నమాట. ఒక్క లీడర్ వచ్చినా చాలు.. ఒక బహిరంగ సభనే ఏర్పాటు చేసేలా ఉన్నారు.. కోట్ల ఖర్చు పెట్టి. మళ్లీ విడత రైతు బంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాల్సిందేనా? అన్నారు వ్యంగ్యంగా జగిత్యాల వేదికగా. రైతుబంధు కోసమేమో గానీ.. ఆ జీవన్రెడ్డికి పెట్టినట్టు మాకు కూడా సభ పెడతావా? అని చోటోమోటా లీడర్లు కూడ అడిగేలా ఉన్నారు.. మీ పార్టీలోకి వచ్చే ముందు. దానికీ తయ్యారుగానే ఉన్నారు కేసీఆర్.
ఎందుకంటే.. జగిత్యాలలో జరిగిన సభ.. జీవన్రెడ్డి గురించి కాదు. ఆయనకంత సీన్ లేదనీ తెలుసు. ఆ సందర్బం, వేదిక, హైప్ క్రియేట్ చేసే ఎత్తుగడ.. వ్యూహాలన్నీ ఇమిడి ఉన్నాయి దీని వెనుక. ఆ వేదిక మీద నుంచే జీవన్రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేశారు కేసీఆర్. గతంలో చాలా మంది కురువృద్ధ నేతలనూ తీసుకున్నారు. సెక్రటరీ జనరల్ అని ఇంకా ఏవేవో ప్రభుత్వ పదవులు కూడా ఇచ్చారు. అవి వాళ్ల దొడ్లోకి వచ్చేదాకనే. దొడ్లోకి వచ్చిన తరువాత బర్ల మందలో అదో బర్రె అంతే.