నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు.. అంటుంటాడు కేటీఆర్ తరచుగా. అంటే కేసీఆర్ను మించి తిట్లదండకాలు చదవడం వచ్చని చెప్పడం దీని ఉద్దేశ్యం కావొచ్చు. కేసీఆర్ బహిరంగ వేదికల మీదే అరే హౌలే! అని కార్యకర్తలనే తిట్టే చొరవ చూపిస్తూ ఉంటాడు. అలా ఆయన తిట్టినా ఆ కార్యకర్తలు కేరింతలే కొడతరు. కేసీఆర్ నోటి వెంట తిట్లు వచ్చినా అవి దీవెనల్లాగే భావిస్తుంటారు గులాబీ సేన. కానీ ఎందుకో కేటీఆర్ కూడా ఇదే తోవలో పోయే ప్రయత్నంలో.. తండ్రి నాడిని అనుసరించి .. జనం వద్ద మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నంలో కొంచెం ఓవర్ చేస్తున్నాడనిపిస్తుంది.
ఆయన మాటల్లో వ్యంగ్యం పాలు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా మాట్లాడితేనే జనానికి తొందరగా ఇంజెక్టు అవుతుందనే భావనకు వచ్చేసుంటాడు. కానీ ఈ దోరణిలో ముందుకు సాగుతున్న కేటీఆర్.. అందులో బాడీ షేమింగ్కు తరుచూ అవకాశం ఇస్తున్నాడు. ఇది విపరీత దోరణిలోనే చూడాలి. ఆవేశంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడితే ఆ ప్రసంగ వేగంలో కలిసిపోతుంది. కానీ తరుచూ అవే మాటలను వాడుతుంటే ఇదేదో మానసిక రోగమా అనే స్థితికి తీసుకువస్తుంది పరిస్థితిని. హరీశ్రావు కొన్ని సందర్భాల్లో కంట్రోల్ తప్పినా శృతి మించకుండా జాగ్రత్త పడతాడు. సబ్జెక్టు పరంగా విమర్శలు చేయడం ద్వారా దానికి కొంచెం విలువ యాడ్ అవుతుంది.
సబ్జెక్టు లేకుండా ఎడాపెడా తిట్లకే పరిమితమవుతే.. ఓ బండి సంజయ్ లాగో, ఓ రాజాసింగ్ లాగో అప్పటికి బావోద్వేగాలు రెచ్చగొట్టడానికి పనికొస్తాయే తప్ప.. లాంగ్ రన్లో ఆ మాటలకు గుర్తింపు ఉండదు. మాట్లాడిన నేతలకూ విలువ తగ్గుతుంది. క్వాలిటీ లేని స్పీచుగా మిగిలిపోతుంది. కంటెంట్ లేకపోవంతోనే కంగారులో తిట్ల దండకాలకు, బాడీ షేమింగులకు పాల్పడుతున్నారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బాటలో సాగుతున్నాడు. సీఎం రేవంత్ను తరుచూ పొట్టోడా.. పొట్టోడా అని బాడీ షేమింగ్కు దిగుతూ ఉంటాడు. ఇది సరైంది కాదని అతనికీ తెలుసు. కానీ ఇంతలా ఇక దిగజారితేనే తప్ప లాభం లేదని ఫిక్స్ అయి ఉంటాడు.
ఇక ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆరున్నర అడుగులున్నావ్.. తాడిపెరిగినట్టు పెరిగావ్.. ఏం లాభం..!అని మళ్లీ బాడీ షేమింగ్కు దిగాడు. శరీరాకృతిలపై , రూపు రేఖలను టార్గెట్ చేసి తిట్టే ఆ బాడీ షేమింగ్ను రాజకీయపరంగా పెద్దగా మెచ్చుకోలుండవు. మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చి పెట్టొచ్చు మొదట్లో. కానీ ఆ తరువాత జనానికి విసుగొస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పరిస్థితి కూడా ఇదే. ఆయన తొలత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేసీఆర్ను, కవితను చెడామడా తిట్టేవాడు. దీంతో జనం అంతా ఆసక్తిగా అతని మాటల వినేవారు.
ఇక ఇప్పటికీ అదే పంథాలో పోతున్నాడు. కానీ అప్పుడున్నంత ఇంట్రస్ట్ ఇప్పుడు జనాల్లో లేదు. పైగా అతని పదవికి తగ్గట్టు పరిపాలన, అభివృద్ధి లేదని తేలిపోవడంతో జనంలో నెగెటివిటీ పెరిగిపోయింది. ప్రభుత్వ పెద్దలను ఈ స్థాయిలో తిడితే తప్ప.. తనను సీఎంకు పోటీ అనుకోరనే ఆత్మన్యూనతనా? తండ్రిని టార్గెట్ చేసి తరుచూ విమర్శించే తీరుకు ప్రదర్శించే అసహనమా? అధికారం పోయిందనే ఫ్రస్టేషనా? మొత్తానికి కేటీఆర్ మాట తీరు ముదిరింది. దారి తప్పింది. హరీశ్రావు ఈ విషయంలో చాలా బెటర్ అనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.