తెలంగాణ రాష్ట్రంలో సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంలోని తన ఛాంబర్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పుష్కరాల అధికారిక పోస్టర్, టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో ఈ వేడుకలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రూ. 30.63 కోట్ల అంచనా వ్యయంతో 162 అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆమె వివరించారు.
పుష్కరాల నిర్వహణలో అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేలా, స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే సరస్వతి ఆది పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతరలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో రానున్న గోదావరి పుష్కరాల కోసం కూడా ఇప్పుడే పనులను ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పుష్కరాల పనులను గడువు కంటే పది రోజుల ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ఇతర శాఖలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. కాళేశ్వరం దేవస్థాన పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ. 198 కోట్లను కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల విషయంలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పనుల నాణ్యత విషయంలో నిరంతరం నిఘా ఉంచాలని, భక్తుల నుంచి వచ్చే సూచనలను స్వీకరించాలని మంత్రులు సూచించారు. సరస్వతీ అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రతిష్ట పెంచేలా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.
ALSO READ: బెంగాల్ ఎగ్జిట్ పోల్స్.. దీదీ హ్యాట్రిక్ కొడుతుందా? కమలం వికసిస్తుందా? షాకింగ్ రిపోర్ట్!