సీఎం రేవంత్ను కేటీఆర్ అపరిచితుడని సంబోధిస్తుంటాడు అప్పుడప్పుడు. కానీ నిజంగా చెప్పాలంటే కేటీఆర్ను చూస్తే మాత్రం అచ్చంగా అపరిచితుడే అనిపిస్తుంటుంది. మొన్నటికి మొన్న రాష్ట్ర కార్యవర్గ మీటింగులో తీర్మానం చేసుకున్నారు. సిట్టింగులకు టికెట్లు ఉండవని. మారిన మనిషుల్లాగే..తప్పుదిద్దుకుంటున్న నేతల్లాగే మాట్లాడారు. పరివర్తన చెందుతున్నట్టే కనిపించారు. కానీ ఇవాళ మళ్లీ పాత రాముడే మేల్కొన్నాడు. కల్వకుర్తి నియోజకవర్గ మీటింగు జరిగింది. ఆ సమావేశంలో కేటీఆర్ అసంతృప్తితో కూడా ప్రసంగం సాగింది.
జనాన్ని మళ్లీ నిందించే పనినే భుజానికెత్తుకున్నట్టు కనిపించింది. కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా… మనం అర్థం చేసుకోవాలన్నాడు. అది మన మంచికే అని డిసైడ్ కావాలన్నాడు. లోకల్ మీరంతా కలిసి వారిని ఓడగొడితే.. ఇక్కడ కేసీఆర్ ఎట్లొస్తడనుకున్నరు? అని నిలదీశాడు. ఇకపై అట్ల చేయొద్దని హితవు పలికాడు. జనానికి మనమంటే ఏందో తెలవాలె.. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు.. మరి కేసీఆర్ అడగకముందే అన్నీ చేసిండు.. అందుకే కేర్ లేకుండా అయిపోయింది.. అని కోప్పడ్డాడు జనంపై. ఏ కేసీఆర్ కాకపోతే రేవంతు.. ఎవరైనా ఇస్తరు… రైతుబంధు.. వాళ్లింట్లకెళ్లి తెచ్చిస్తుర్రా..! అని అనుకున్నరు. మరి ఇప్పుడెందుకు ఇస్తలేడు రేవంత్ రైతుబంధు.. అని దెప్పిపొడిచాడు జనాన్ని. ఇవన్నీ మీకు తెలవాలె… అందుకే ఇన్ని రోజులు మేం సైలెంట్గా ఉన్నం.. మాకు పనులు లేవా? మాకు సంసారాల్లేవా? ఊకె మీ సమస్యలు పట్టుకు తిర్గతందుకు? అని అసహనం కూడిన వ్యాఖ్యలు చేశాడు.
అయినా కత్తి వాడికెవడికో ఇచ్చి.. మమ్మల్ని యుద్దం చేయమంటరెందుకు? అని ఓడగొట్టినందుకు మీకు తగిన శాస్తే అయ్యింది బిడ్డా! అన్నట్టుగా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగానే మాట్లాడిండు. ఇప్పుడు చేయనోడు.. ఆఖరికి చేస్తానంటున్నడు.. మోస పోకుర్రి ఇకనైనా అని జర జనాన్ని భయపెట్టే ప్రయత్నం కూడా చేశాడు. అన్న వస్త్రంకు పోతే ఉన్న వస్త్రం ఊడిదంట.. అట్లైంది మీ పరిస్థితి అని ఓ సైకో నవ్వు కూడా నవ్వాడు కనిపించకుండా. కడుపులో చల్ల కదలకుండా కేసీఆర్ 11 సార్లు రైతుబంధేస్తే మీకు కనిపియ్యలే.. అని కసురుకున్నంత పని చేశాడు. కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పిండు.. ఆగం కాకుర్రి కాకుర్రి అని.. ఈన కాల్చి నక్కల పాలు చేసినట్టు చేసిర్రు అని గుర్రుగా చూస్తూ మాట్లాడిండు. ఏహె అధికారందేముంది? మేం చూడనిదా? అని లైట్ తీసుకున్నట్టే తీసుకుని.. పదేండ్లకోసారి పంట మార్పిడి లెక్క అనుకొని మమ్మల్ని దింపేసిండ్రట..గిదేం పద్దతి? అని జనం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డడు.
సంసారం సక్కగా నడుస్తుంటే పెళ్లాం మొగుడ్ని ఇడిసేస్తే నడస్తుదా? మొగుడు ఇగ గీ పెండ్లాం వద్దు కొత్తది కావాలంటే మంచిగుంటదా? అని పెండ్లాం మొగల ముచ్చట చెప్పి కస్సుమన్నడు రామన్న. సరే గానీ గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగొద్దు.. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు చేయొద్దు.. గుణపాఠం నేర్చుకుని అధికారం కోసం ట్రై చేయాలె. ఒక్క ఏడాది ఓపిక పట్టుర్రి..ఇక వచ్చేది ఎన్నికల ఏడాదే.. మన సత్తా చూపుదాం.. అని పిలుపిచ్చిండు. చివరకు సమజైందేమిటంటే.. కేసీఆర్ మళ్లా ఎవరిని నిలబడితే వాళ్లకు ఓటెయ్యాలంతే. వాళ్లెవరైనా గానీ. గా లెక్కలన్నీ పెద్దాయనే చూస్కుంటడు. పెద్దాయనను ఈళ్లు సూస్కోని ఓటేయ్యాలె.. సీఎంను చేయాలె.. గిదన్న మాట మారని రామన్న తాజా ముచ్చట.