BJP mission South India: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణలో ఒక కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. సాధారణంగా ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా.. అధికారిక కార్యక్రమాలు లేదా బహిరంగ సభలకే పరిమితమవుతారు మోదీ. ఈసారి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్లో పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడు నివాసాలకు స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరపడం కేవలం పరామర్శేనా? లేక దీని వెనుక తెలంగాణను లక్ష్యంగా చేసుకున్న బలమైన రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.
దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ క్రమంగా తన పట్టును బలపరుచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడానికి.. విస్తరించుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక.. తెలంగాణ.. కేరళ.. తమిళనాడులో కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్డీఏ (NDA) కూటమి అధికారంలో ఉంది. ఈ క్రమంలో దక్షిణాదిలో బీజేపీకి తెలంగాణ అత్యంత కీలకమైన రాష్ట్రంగా కనిపిస్తోంది. దీంతో చంద్రబాబుపై అధారపడక తప్పడం లేదు బీజేపీకి. తెలంగాణలో గత కొంతకాలంగా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ లోటును పూడ్చేందుకు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్లను వారధిగా వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లేదన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి క్షేత్రస్థాయిలో కొంత బలమైన క్యాడర్ ఉందనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా ఉన్న ఈ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు ఉన్న యువత క్రేజ్.. చరిష్మా తెలంగాణలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ రెండు అంశాలను సమన్వయం చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ను ఢీకొట్టడం సులభమని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే ఎవరి ఇంటికీ వెళ్లని మోదీ.. ప్రత్యేకంగా చంద్రబాబు.. పవన్ నివాసాలకు వెళ్లి మంతనాలు జరిపారు. ఇది కేవలం పరామర్శ మాత్రమే కాదని.. 2029 లక్ష్యంగా తెలంగాణలో పాగా వేయడానికి వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్ అని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టాలంటే కూటమి ఐక్యత అవసరమని మోదీ భావిస్తున్నారు. చంద్రబాబుకున్న రాజకీయ అనుభవం.. వ్యూహరచన తెలంగాణలో బీజేపీకి ప్లస్ అవుతుందని వారి నమ్మకం. గంటకు పైగా జరిగిన చర్చల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు.. పొత్తుల అంశాలపై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను పరామర్శించడం ద్వారా యువతలో ఉన్న సానుకూలతను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
అయితే ఇక్కడ బీజేపీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బాహటంగానే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా పోరాడుతుంటే.. తెలంగాణలో కొందరు నేతలు తమ స్వార్థం, ఈగోల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేవాళ్ల పెళ్లిళ్లలో మనం డ్యాన్సులు చేయాలి? మన ఇంట్లో పెళ్లి (తెలంగాణలో అధికారం) ఎప్పుడు చేసుకుంటాం?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను విస్మరించి ఈగోలకు పోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని హెచ్చరించారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీలో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.
Read Also: మోదీ ముందు కంటతడి పెట్టిన బండి సంజయ్.. వేదికపై అసలేం జరిగింది?