మంత్రి కొండా సురేఖకు ఉన్న ఏకైక బలం బీసీ మహిళా మంత్రి అని.ఈ కార్డే ఆమెను కాపాడుతూ వస్తోంది. కానీ ఆమె ఇప్పటికే సర్కార్కు చేయాల్సిన డ్యామేజీ చేసేశారు. కుటుంబం మొత్తం బయటకు వచ్చి మరీ రేవంత్ సర్కార్ను తిట్టిపోసినంత పనిచేశారు. కానీ రేవంత్ ఆమెను ఏమీ అనలేదు. తాజాగా ఆమె ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
వాస్తవానికి ఇది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశం. కానీ ఆమె ఏకంగా మీడియా ముఖంగానే బయటకు వచ్చారు. అందరినీ కలుస్తున్నారు. ఫిర్యాదు చేస్తున్నారు. తనకు తీవ్ర అన్యాయం జరగుతుందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇద్దరికీ మధ్య విభేదాలున్న మాట వాస్తవమే. కడియం కొంచెం అతి చేశాడు.. చేస్తాడనే విషయమూ అందరికీ విదితమే.
కానీ ఇది కాంగ్రెస్ పార్టీ. అందులోనూ అక్కడున్నది కొండా సురేఖ. ఆమె నోరు విప్పితే అంతే సంగతులు. ఎవరినీ చూడరు. వెనుకా ముందు ఏమీ ఆలోచించరు. దీనిపై కడియం కూడా స్పందించాడు. కొండా సురేఖ అనవసరంగా దీన్ని రచ్చ చేస్తూ టైం వేస్టు చేసుకుంటున్నారని లైట్గా తీసుకున్నారు. అంతే కాదు.. ఉమ్మడి వరంగల్లో పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ఎవరు చూసుకుంటారు? అని .. నేను ఇంతే ఉంటా..! ఇలాగే చేస్తా..! ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో! అన్నట్టుగానే కడియం కామెంట్లున్నాయి.
అంటే తనకు పై నుంచి అండదండలున్నాయి. పార్టీ ఉత్తగనే మారలేదు. తన ప్రయార్టీ ఏంటో రేవంత్కు తెలుసు… నన్నేం వివరణ కూడా వారు అడగరు..! అని ఆయన డైరెక్టుగా, ఇండైరెక్టుగా కామెంట్ చేయడం.. ఈ రచ్చ రాజకీయానికి పుల్స్టాప్ పడేలా లేదనే విషయాన్ని తెలియజేసింది. అయితే ఇది కాదు ఇప్పుడు ముచ్చట. కొండా సురేఖ తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిశారు. ఏకంగా ఆయనకు ఈ విషయంలో ఓ వినతి పత్రాన్ని కూడా అందించారు. అదీ మీడియా ముఖంగా.
దీనికి పార్టీ పెద్దగా ఉన్న మహేశ్ కూడా ఆమె ఇచ్చిన వినతిని స్వీకరిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడమే చర్చకు తావిచ్చింది. ఇదేమైనా జనం సమస్యనా? నియోజకవర్గ అభివృద్ధి గురించా? ఇంకేమైనా నిధులు రావాలనా? జనాలు పడుతున్న ఇబ్బందులపైనా? అవేం కాదు. ఇది కుటుంబ సమస్య. ఇంటి గొడవ. ఇంటికి పెద్దగా ఉన్న మహేశ్.. దీన్ని అంతర్గతంగానే చర్చించి, సముదాయించి దీన్ని సద్దుమణిగేలా చేయాలి.
కానీ ఈ ఫోటో చూస్తే.. సరే, మీ గొడవ మీరు పడండి..! మేం చేసేది మేం చేస్తాం..! అన్నట్టుగా ఉంది.ఇది ఎలాగూ అందరికీ తెలిసిన ముచ్చటే కదా..! దాచడమెందుకు? దీంట్లో దాపరికమేముంది? అని కూడా మహేశ్ అనుకుని ఉంటారు. ఇది ఎప్పుడూ ఉండేదే.. ఇలా తీసుకోకపోతే.. సురేఖతో మరో కొత్త పంచాది ఎందుకు? అని కూడా భయపడి ఉండొచ్చు.
ఏదీ ఏమైనా.. మహేశ్ కుమార్ గౌడ్ ఇలా.. ఇంటి రచ్చ విషయంలో.. బహిరంగంగా, మీడియా ముఖంగా ఇలా వినతి తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. చర్చకు తెర తీసింది. ఇక్కడ కొండా సురేఖ ఆరోపణలు కూడా సీఎంను ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. తనకు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సమస్య లేదట. టీడీపీ నుంచి వచ్చిన నేతలతోనే ఇబ్బందిగా మారిందని, కడియం కూడా టీడీపీ నుంచే వచ్చారు కాబట్టి.. తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె ఆరోపించారు.
అంటే.. కడియంను తీసుకొచ్చింది రేవంత్రెడ్డి. అదప్పుడు పార్టీ అవసరం. అధిష్టాన నిర్ణయం. ఇప్పుడు ఆ అధిష్టాన నిర్ణయాన్నే ఆమె ధిక్కరించే పరిస్థితికి వచ్చారు. మరి ఈ ఇష్యూను అంతర్గతంగా కంట్రోల్లోకి తీసుకు రావాల్సిన అధ్యక్షుల వారు.. ఇలా నిమిత్తమాత్రుడిగా.. చేష్టలుడిగినట్టుగా… వినతి పత్రం తీసుకోవడం.. అదీ ఫోటో కూడా దిగడమే పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నదనేదే ఇప్పుడు కొత్త రచ్చ.