ప్రశ్న రావణ్ .. ప్రశ్నించడమేమోగానీ.. ఏపీ పాలిటిక్స్ ఆటలో అరటి పండుగా మారాడు. ఇప్పటి దాకా రావణ్ (జోసెఫ్)ను వైఎస్సార్ సీపీ ఎత్తుకున్నది. ఉపా లాంటి కఠినమైన దేశ ద్రోహ సెక్షన్లు పెట్టడాన్ని తప్పుబట్టింది. సాయికృష్ణ లాకప్డెత్ విషయంలో కూడా ఆ పార్టీ అండగా ఉంటూ వస్తోంది. వరుస సంఘటలను తమకు అనకూలంగా మలుచుకుని.. కూటమి సర్కార్ను ముప్పు తిప్పులు పెడుతూ వస్తోంది.
ప్రశ్న రావణ్ అంశం కూడా బాగా కలిసి వచ్చింది. ఇక రెచ్చిపోతుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా వైఎస్సార్ సీపీ తన స్టాండ్ మార్చుకున్నది. యూటర్న్ అయ్యింది. అసలు ఈ రావణ్ ఎవడు..? వాడికి మా పార్టీకి ఏం సంబంధం.. ? మమ్మల్ని కూడా తిడుతూ చాలా వీడియోలు పెట్టాడు? కేవలం అతని మీద ఉపా లాంటి కేసులు పెట్టడాన్నే మేము వ్యతిరేకించాం..? ప్రశ్నిస్తే ఇంతలా వేధించాలా? అనేదే మా స్టాండ్..! అంటూ మాజీ మంత్రి కొడాలి నాని కొత్త రాగమందుకున్నాడు.
ఇదిప్పుడు ఏపీ పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్. అంతే కాదు… ఇప్పటి వరకు రావణ్.. టీడీపికి సంబంధించి ఒక్క వ్యతిరేక పోస్టు కూడా పెట్టలేదట. బాలకృష్ణ, లోకేశ్, చంద్రబాబు ఇతగాడిని పెంచి పోషించారట. అందుకే వీరి గురించి ఒక్క మాట కూడా మాట్లాడని రావణ్.. పవన్ గురించి, పవన్ పర్సనల్ లైఫ్ గురించి పదే పదే కామెంట్లు చేస్తూ ఉంటాడట.
ఈ విషయాన్ని బయటపెట్టింది వైఎస్సార్ సీపీ. చంద్రబాబు, పవన్ల మధ్య అంతర్గత విభేదాలున్నాయని చెప్పడం ఓ వ్యూహం కావొచ్చు. అందులో భాగంగానే వైఎస్సార్ సీపీ ఈ స్టాండ్ తీసుకుందని అనుకుంటున్నారంతా. పవన్ను ఉన్నపళంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అతను సీఎం సీటుకు ఏమైనా ఎసరు పెట్టాలనుకుంటున్నాడా? అని లోతుగా తరచి చూసినా.. పవనే తన అసమర్థతను అంగీకరించాడు తెలంగాణ గడ్డ మీదకు వచ్చి.
నేను అక్కడనే ఏం కాలేకపోయాను.. ఇక్కడేం పదవులు వెలగబెట్టగలుగుతాను..! మా పార్టీకి చెందిన తెలంగాణ లీడర్లు కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వారి కోసమే ఇక్కడికొస్తున్నాను..! అని అన్నాడు పవన్. కానీ చంద్రబాబు అతి జాగ్రత్త పరుడు కదా. లోకేశ్ను సీఎంను చేయాలంటే.. పవన్ను బలంగా కాకుండా బలహీనంగా చిత్రీకరించాలని చూస్తున్నాడా? మరి వచ్చే ఎన్నికల్లో పవన్ బలం లేకుండానే చంద్రబాబు అధికారంలోకి రాగలుగుతాడా? ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తింది వైఎస్సార్ సీపీ.
జనాల్లో గందరగోళం సృష్టించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకున్నది. కొత్తగా ఇప్పుడు పోలీసులు చెబుతున్న ముచ్చట… రావణ్ సెల్ఫోన్లో అడల్ట్ కంటెంట్ ఉందని, దీంతో వైఎస్సార్ సీపీ ఏమైనా యూటర్న్ తీసుకుందా? కానీ రావణ్కు మాత్రం సోషల్ మీడియాలో మైలేజే వస్తోంది. ఉపా చట్టం కింద కేసు పెట్టడం మాత్రం సానుభూతిని తెచ్చిపెట్టింది. దీన్ని తగ్గించేందుకే అడల్ట్ కంటెంట్ను క్రియేట్ చేశారా ? అనే అనుమానాలు లేకపోలేదు. వైఎస్సార్ సీపీ తీసుకున్న యూటర్న్ స్టాండ్ మాత్రం ఆపార్టీకి పెద్దగా ఉపయోగపడేదైతే కాదనిపిస్తోంది. జగన్ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి మరి…