జగిత్యాల సభలో కేసీఆర్ తన చావు కోరకుంటున్నారని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను కొడకా! అని కూడా సమాధానమిచ్చుకున్నారాయన. ఉట్టి.. పిల్లి కథను కూడా చెప్పారు దీనికి రిలవెంట్గా. రేవంత్ పేరు ఎక్కడా తీయకున్నా.. ఈ వ్యాఖ్యలు ఆయననుద్దేశించే అన్నవిగా రాజకీయ వర్గాల్లో డిస్కషన్కు వచ్చింది. అయితే దీనిపై రేవంత్ ఎక్కడా స్పందించలేరు. ఇవాళ ఆయన మీడియా చిట్ చాట్లో దీనికి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పంచులేశారు.
కేసీఆర్ చావును కోరుకుంటే ఆయన వారసత్వం కోసం పాకులాడే వాళ్లు కోరుకుంటారన్నారయన. పరోక్షంగా అలా కోరుకునేది కేటీఆరే అనే అర్థం వచ్చేలా. ఇప్పుడు కవిత కూడా బీఆరెస్లో లేదు. ఆమె తన సొంత దారి వెతుక్కున్నారు. సొంతంగా టీఆరెస్ అని పార్టీ పెట్టుకుని.. ఆదిలోనే బీఆరెస్కు గట్టి షాక్ ఇచ్చారు. తదుపరి ఆ పార్టీ లైన్, కార్యాచరణ ఎలా ఉంటుందో పార్టీ పేరుతోనే ఆమె జనాలకు చెప్పకనే చెప్పారు. ఇక ఆ పార్టీ వేదకగానే ఆమె పోరాడనున్నారు. తనను అవమానించి బయటకు వెళ్లగొట్టిన కేసీఆర్, కేటీఆర్పై ఆమె ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నట్టుగా ఆమె మాటల ద్వారా జనాలు తెలుసుకోగలుగుతున్నారు. ఇక బీఆరెస్కు మేమే ప్రత్యామ్నాయం అనేలా ఆమె అడుగులు పడుతున్నాయి.
ప్రధాన ప్రతిపక్షంగా జనం తమను గుర్తించాలని ఆమె కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పడమంటే.. కేటీఆర్కు ఆమె బీఆరెఎస్లో పోటీ కాదు. కేటీఆర్కు పొలిటికల్ వారసత్వ పోరులో లైన్ క్లియర్ అయ్యింది. కాకపోతే టీఆరెస్ వేదికగా కవిత, బీఆరెస్ వేదికగా కేటీఆర్.. ఎవరు నిజంగా కేసీఆర్ వారసులో రాజకీయంగా నిరూపించుకోవాల్సి ఉంది. దాని కోసం ఎవరి దారి వారిదే.. ఎవరి పార్టీ వారిదే. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో … కేసీఆర్ చావును ఆయన వారసత్వం కోసం అర్రులు చాచే వారే కోరుకుంటారనడం… కేటీఆర్కే ఆ అవసరం ఉంటుంది తప్ప.. తనకేం ఉంటుందనే అర్థం వచ్చేలా అనడం చర్చకు తెర తీసింది.
మీ ఇంట్లో నీ చావును కోరుకునేది నీ కొడుకే.. నువ్వు లేకపోతే..ఇక తన సీఎం సీటుకు పోటీ ఉండరు..నేనే సీఎం కావొచ్చు.. అనేది కేటీఆర్ ఉద్దేశ్యంగా ఉంది.. అని రేవంత్ పరోక్షంగా ఈ కామెంట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా అటు కేసీఆర్ .. తన చావు ను కోరుతున్నారని జనం ముందు సింపతీ కోరుకునే విధానానికి చెక్ పెట్టడంతో పాటు.. నీ కొడుకునే ఆ అవసరం ఉంటుందని కేటీఆర్నూ డిఫెన్స్లో పడేసే విధంగా రేవంత్ ఇలా వ్యాఖ్యానించి ఉండొచ్చనే విశ్లేషణలు చేస్తున్నారు.
ఇక ఆ పార్టీ ఆవిర్భావం వేళ.. రేవంత్ కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. బీఆరెస్ పార్టీ చచ్చిన పార్టీతో సమానమని అనడమే కాదు.. శవానికి ఎంత ముస్తాబు చేసినా ఏం లాభం అని వ్యాఖ్యానించడం బీఆరెస్ పార్టీలో కలకలం రేపింది. ఆవిర్భావ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ విజువల్స్ ఓ వైపు.. ఆ పార్టీ ఇక లేవదు..చచ్చింది.. ఆ శవానికి ఎంత మేకప్ చేసినా వేస్ట్..!అనేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరోవైపు… రాష్ట్ర రాజకీయాల్లో హీట్ను పెంచాయి. కవిత పార్టీని రేవంత్ లైట్గానే తీసుకున్నట్టు మాట్లాడారు. మెయిన్ పార్టీనే పోతుంది… ఇక ఈ అనుబంధ పార్టీతో ఏం పని! అని కవిత టీఆరెస్ను రేవంత్ తేలిక చేసి మాట్లాడటం కూడా రాజకీయంగా చర్చకు తావిచ్చినట్టైంది.