కవితను బయటకు పంపిన నాటి నుంచి ఆమె మరింత దూకుడుగా బీఆరెస్ పార్టీని, తండ్రీకొడుకులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కొత్త పార్టీగా టీఆరెస్ను ఎంపిక చేసుకోవడం కేసీఆర్, కేటీఆర్ను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. దీనిపై ఫిర్యాదు చేస్తాం.. కోర్టుకెళ్తాం..అని తమ అనుచరగణంతో అనిపించినా.. కేసీఆర్, కేటీఆర్ మాత్రం మౌనమే వహిస్తున్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కవిత కొత్త పార్టీ గురించి కేటీఆర్ను విలేకరులు అడిగితే.. ఆయన కూడా ఏదో లైట్గా తీసుకోండని అన్నారు.
మేము పెద్దగా పట్టించుకోబోమన్న కేటీఆర్.. మాదే ఎక్కువకాలం కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీగా చెప్పుకొచ్చారు. కానీ.. కవిత వల్ల తమ పార్టీకి మరింత ఇబ్బందే ఉంటుందనే విషయం వారికి తెలుసు. ఇది చాలా సార్లు రూఢీ అయ్యింది కూడా. ఆమె పార్టీ పెట్టకముందు నుంచే ఆమెపై మాటల దాడి మొదలైంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె బాహాటంగానే చెప్పడం.. దీని వెనుక మొత్తం హరీశ్రావే ఉన్నాడని ఆరోపించడం కూడా ఆ పార్టీలో కలకలం రేపింది. దీంతో ఇక కేసీఆర్ ఉపేక్షించదలుచుకోలేదు. కవిత స్టాండ్ స్పష్టంగా అర్ధమైపోయిందాయనకు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు.
ఇక ఆమెపై మాటల దాడి మొదలైంది. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి సైతం ఆమెను లిక్కర్ రాణి అంటూ సంబోధించడం పరిస్థితి తీవ్రను మరింతగా పెంచింది. కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉన్నవారిలో నిరంజన్ రెడ్డి ఒకరు. సీనియర్ నేత. కేసీఆర్, కేటీఆర్ పర్మిషన్ లేకుండా ఆయన ప్రెస్మీట్లో లిక్కర్రాణి అంటూ కవితను సంబోధించడం జరగదు. కచ్చితంగా వారికి సమచారం ఉంటుంది. వారి పర్మిషన్ కూడా ఉంటుంది. మరి బిడ్డెను లిక్కర్ రాణి అని తిట్టించాలని కేసీఆర్ డిసైడ్ అయితే, చెల్లెను లిక్కర్ రాణి అని అనేందుకు నా నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని రామన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇక ఆమె గురించి వేరే ఆలోచించే స్థితిలో వారు లేరు.
ఇప్పుడైతే మరింత దూకుడుగా ఉన్నారు. తండ్రిని కేసీఆర్ అని పేరు పెట్టి సంబోధించడం షురూ అయ్యింది. ఆయన మర మనిషిగా మారిపోయాడని తిట్ల దండకం చదవడమూ మొదలైంది. అన్నను ఉత్తి అమాయకుడు.. బెబ్బెబ్బెబ్బె అనే విధంగా వెటకారంగా తీసి పారేసిందామె. అందుకే కేసీఆర్, కేటీఆర్ కూడా కవిత మీద నేరుగా మాట్లాడితే తమ హుందాతనం తక్కుతందని, రాజకీయంగా అది తమ స్థాయిని దిగజారుస్తుందని అనుకుంటున్నారు. అందుకే వ్యూహాత్మకంగా తమ అనుచరులు.. దగ్గర వాళ్లతో తిట్టించేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా తొలిసారిగా ఆమె మీద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్పందించారు.
జీవన్రెడ్డి మొన్నటి దాకా కేసీఆర్తో ఫామ్హౌజ్లోనే సేద తీరాడు. రామన్నా రామన్నా అంటూ కేటీఆర్ వెనుకే తిరిగాడు. ఏమైందో ఈ మధ్య దూరం పెట్టేశారు వీరిద్దరు. ఇప్పుడు జీవన్రెడ్డి .. కవితపై ఫైర్ అయ్యాడు. ఆమెకు పదవులెక్కడ్నుంచి వచ్చాయి.. పార్టీ పెట్టడానికి డబ్బులెక్కడివి? ఆమె పుట్టుకెక్కడిది? ఇవన్నీ మరిచి కేసీఆర్ను తిడుతుందా? కర్మ సిద్దాంతం ఉంది కదా.. ఆమెకు తగిన శాస్తి జరిగి తీరుతుంది.. అని శపించినంత పనిచేశాడు. ఇక రేపట్నుంచి కవితపై మాటల దాడి మరింత తీవ్రం కావడం ఖాయం. కానీ కేసీఆర్, కేటీఆర్ మాత్రం కవితపై మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శించనున్నారు.