ఫ్యూచర్ సిటీపై వివాదాన్ని రగిలించిన బీఆరెస్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది రేవంత్ సర్కార్. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. నిర్మాణం చేపట్టిన ఫ్యూచర్ సిటీని ఆదిలోనే నిర్వీర్యం చేయాలని కేటీఆర్ భావిస్తున్నాడు. మొన్న హరీశ్రావు.. మేము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నాడు. దీన్ని కేటీఆర్ కూడా ఆమోదించినట్టుగా ఓ ప్రకటన చేశాడు. అంతే కాదు.. అది ఫార్మాసిటీ.. ఎలా దాంట్లో నివాసముంటారు? పైగా జర్నలిస్టులకు కూడా అక్కడ జాగాలిస్తామంటున్నారు. అని కొత్త అనుమానాలకు తెరలేపాడు.
మొత్తంగా బీఆరెస్ దీన్ని పనికి రాని ప్రాజెక్టుగా ప్రొజెక్టు చేసే పనిలో ఉంటే.. కాంగ్రెస్ సర్కార్ దీన్ని తిప్పి కొట్టే పనిని ఎత్తుకున్నది తాజాగా. మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం సాధ్యం కాదు.. ఒకవేళ చేసినా..అక్కడ కొనుగోలు చేసిన ప్రతీ ఇంచు భూమికి లెక్క గట్టి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అనవసర రాజకీయం తప్పితే.. అది అయ్యేది కాదు పొయ్యేది కాదన్నాడు. ఇవాళ రేవంత్రెడ్డి కూడా తన ప్రసంగంలో ఫ్యూచర్ సిటీ ప్రస్తావన తెచ్చాడు. ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా నిర్మిస్తాం.. ఫార్మా పరిశ్రమల కాలుష్యంతో స్థానికులకు నష్టం జరుగుతుందని అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన 500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం.. అని ప్రకటించారు.
అంతే కాదు.. బీఆరెస్ నాయకులు భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు. ఏ అభివృద్ధి చేస్తామన్నా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. వారిలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష హోదా కాదు కదా.. కారును తోయడానికి కూడా ఎవరూ దొరకరు! అని కామెంట్ చేశారు. అయితే , కేటీఆర్ చేసిన కామెంట్లో కీలక విషయాలున్నాయి. తాము ఫార్మాసిటీ కోసం ఆ భూములను సేకరిస్తే.. దాన్ని ఇప్పుడు 30వేల ఎకరాలకు పెంచి ఫ్యూచర్ సిటీగా మారుద్దామని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నదని అన్నాడు. దీనిపై కోర్టులో కూడా.. అక్కడ ఫార్మాసిటీనే నిర్మిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఉంది. అలా చేయకపోతే ఆ భూములు రద్దు చేస్తారు. అందుకే భయపడి కోర్టుకు అలా చెప్పాల్సి వచ్చింది.
రేపు అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకపోతే.. దాని ఉద్దేశ్యాన్ని తప్పుదోవ పట్టించారనే కారణంతో కోర్టు ఆ భూములపై నెగిటివ్ తీర్పు ఇవ్వొచ్చు.. అనేలా కేటీఆర్ కామెంట్ చేశాడు. దీంతో అనుమానాలు బాగా పెరిగాయి. నిజానికి, ఈ ఫ్యూచర్ సిటీపై అపోహలు, అనుమానాలు సృష్టించాలనే కేటీఆర్ భావిస్తున్నాడు. అదే చేస్తున్నారిప్పుడు ఓ ప్లానింగ్ ప్రకారం. కానీ దీన్ని పరిపూర్ణంగా తిప్పికొట్టే పనిలో సర్కార్ విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే వారికి న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. బాహాటంగా ఇక్కడ ఫార్మా కంపెనీలు రాబోవు..! అని ప్రజలకు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. దీన్నే బలహీనతగా తీసుకుని బీఆరెస్ ఫ్యూచర్ సిటీపై దాడి చేస్తోంది.
వాస్తవానికి, దీనిపై సర్కార్ భారీ ఆశలు పెట్టుకున్నది. పెద్ద పెద్ద కంపెనీలకు కూడా రెడ్ కార్పెట్ పరిచింది. సర్కార్ ఊహించిన విధంగానే పెట్టుబడి దారులు.. పెద్ద పెద్ద కంపెనీలు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ముందుకు వస్తున్నాయి. కానీ ఆదిలోనే హంసపాదులా బీఆరెఎస్.. రేవంత్ ఫ్యూచర్ ఆశలను మొగ్గలోనే తుంచాలని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే ప్రచారం ముమ్మరం చేస్తూ వస్తోంది. దీన్ని గట్టిగా నిలదీసి, క్లారిటీగా సర్కార్ నుంచి ధీటైన జవాబు రాకపోతే.. రేవంత్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా..? అనే డిస్కషనూ తొందరలోనే స్టార్ట్ చేస్తారు.