పైలట్ రోహిత్రెడ్డి రేపు బెయిల్పై విడుదల కాబోతున్నారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రోహిత్రెడ్డిని మార్చి 14న రిమాండ్ చేశారు. చంచల్ గూడ జైలు నుంచి రేపు బెయిల్పై విడుదల కానున్నారనే వార్త నేపథ్యంలో మళ్లీ ఇది రాజకీయ చర్చకు తావిచ్చింది. ప్రధానంగా కవిత వర్గం పైలట్ రోహిత్ ఉదంతాన్ని తీసుకుని బీఆరెస్ను టార్గెట్ చేస్తున్నది.
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ.. రోహిత్రెడ్డి కేసును ప్రస్తావిస్తూ చర్యలపై ఎందుకు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలను చేస్తున్నది. జనం ముందు బీఆరెస్ను దోషిగా నిలిపేక్రమంలో పైలట్ ఉదంతం కవిత పార్టీ వర్గీయులకు మంచి అస్త్రంగా మారింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుల్లో పైలట్ రోహిత్రెడ్డిని చేర్చిన తదనంతరమే.. కవిత వర్గీయులు బీఆరెస్పై దండయాత్ర మొదలు పెట్టారు. చర్యలేవీ? ఇంత బాహాటంగా దొరికినా.. ఇంకా మీనమేశాలా? కవిత పార్టీ అంతర్గత విషయాల్లో జరిగిన లోపాలను, తప్పులను ఎత్తి చూపితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేస్తారా? అని మాటల దాడికి దిగింది.
సోషల్ మీడియాలో పైలట్ రోహిత్రెడ్డి డ్రగ్స్ కేసును చూపుతూ బీఆరెస్పై చేసిన మాటల దాడిని తట్టుకోలేకపోయింది గులాబీ దండు. దీంతో పైలల్ రోహిత్ జైలులో ఉండగానే.. ఆయనకు నోటీసులు అందించింది. వారం రోజులు గడువిచ్చింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నీ పాత్ర ఏందీ? దీనిపై నీ వివరణ ఏమిటి? వారం రోజుల్లో స్పందించాలి! అని నోటీస్ ఇచ్చారు. కానీ దీనిపై ఇంత వరకు ఎలాంటి వివరణ రాలేదు. జైల్లో ఉన్నా.. దీనికి వివరణ ఇవ్వొచ్చు. కానీ పైలట్ ఇవ్వలేదు. దీన్ని బీఆరెస్ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు.
పైలట్ను సస్పెండ్ చేస్తే.. డ్రగ్స్ తీసుకున్నాడని, డ్రగ్స్ తీసుకునే నేతలను తమ పార్టీ పెంచి పోషిస్తుందనే సంకేతం వెళ్తుందనే భయం ఓవైపు.. అధికార పార్టీ కాంగ్రెస్ వేసిన ఉచ్చులో చిక్కుకుని .. రాజకీయ వ్యూహంలో పైలట్ను బలి చేయడమే కాకుండా.. మొత్తంగా పార్టీ కూడా సెల్ప్ డిఫెన్స్లో పడే ప్రమాదం ఉందనే కోణంలో కేసీఆర్, కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పైలట్ ద్వారా నెమ్మదిగా ఓ బ్యాలెన్స్డ్ వివరణ తీసుకుని పరిస్థితి తీవ్రతను తగ్గించడం ద్వారా క్రమంగా ఈ ఇష్యూను కనుమరుగు చేయాలనే యోచనలో గులాబీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు దీనిపై కిమ్మనకుండా ఉండిపోయారు.
ఇప్పుడు బెయిల్పై పైలట్ వస్తుండటంతో రచ్చ మళ్లీ మొదటికొచ్చినట్టైంది. కవిత వర్గం కూడా మొన్నటి దాకా పార్టీ ఆవిర్భావ సందడిలో బిజీబిజీగా ఉండింది. ఇప్పుడు ఈ అంశంపై మరింత దాడి చేసేందుకు సోషల్ మీడియా వేదికగా కత్తులు నూరతున్నది. కవితను ఎలా సస్పెండ్ చేస్తారు? పైలట్ రోహిత్రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీ పార్టీ సిద్దాంతం ఇదేనా? పైకి నీతులు చెబతూ మీరు తీసుకునే క్రమశిక్షణా చర్యలివేనా? ఈ రీతిలో కవిత వర్గం నుంచి దాడి షురూ కానుంది. మరి దీనిని ఎలా ఎదుర్కొంటారో..? పైలట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.