టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో ఆధిపత్య పోరు రాజకీయాలు నడుస్తున్నాయి. అక్కడ సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డికి, మహేశ్కు మధ్య పొసగడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మహేశ్కు నిజామాబాద్ జిల్లాలో పట్టు పెరిగింది. అంతా తానై నడిపిస్తున్నారు. ఆయన అధిష్టానం ఎమ్మెల్సీని కూడా కట్టబెట్టింది. మంత్రివర్గంలో చోటు దక్కుతుందనుకున్నా.. ఆయన పీసీసీ చీఫ్గానే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కలేదు. ఈ జిల్లా నుంచి ఉన్న ఏకైక సీనియర్ నేత సుదర్శన్రెడ్డి. ఈ టర్ము తరువాత ఆయన ఇక రాజకీయాల్లోంచి రిటైర్ అవుతానని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ చివరి రాజకీయ మజిలీలో మంత్రిగా చేయాలనేది ఆయన ఆకాంక్ష. గతంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. సీఎం రేవంత్రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే అన్నీ కలిసి వచ్చినా.. మహేశ్ రూపంలో ఆయనకు మంత్రి పదవి రాకుండా రాజకీయాలు నడిచాయనేది ఇక్కడ మొదట నుంచి ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం జరిగినట్టుగానే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు.
కేబినెట్ ర్యాంకుతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చినా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఇంకా ఆయన సీఎం చుట్టూ తిరుగుతున్నారు. అయితే పీసీసీ చీఫ్, సీఎంల మధ్య మంచి సమన్వయం ఉంది. దీంతో ఆయనను కాదని సీఎం ఏం చేయడం లేదు. దీంతో సుదర్శన్రెడ్డికి, ఆయన వర్గానికి అక్కడ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికే సుదర్శన్రెడ్డి తన వర్గానికి చెందిన పలువురికి నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు. మరో రెండు నెలల్లో వీరి పదవీకాలం పూర్తవుతుంది. మళ్లీ వారికి రెన్యూవల్ అయ్యే పరిస్థితులు లేవు. ఇప్పుడు మహేశ్ వర్గానికి చెందిన నాయకులు ఆ పదవులు ఇప్పించుకుంటారనే టాక్ నడుస్తోంది.
కీలకమైన డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో కూడా ఇద్దరి మధ్య రగడ నడుస్తోంది. ఈ సొసైటీ బ్యాంకు ఎన్నికలను నామినేటెడ్ పద్దతిలోనే నియమించాలని ఇటీవల కేబినెట్లో సర్కార్ నిర్ణయం తీసుకున్నది. దీంతో సుదర్శన్రెడ్డి తనకు వరుసకు సోదరుడైన రమేశ్రెడ్డిని డీసీసీబీ చైర్మన్ చేయాలని పట్టుబడుతున్నాడు. మహేశ్ దీన్ని అడ్డుకుంటున్నారు. మొన్నటిదాకా బీఆరెస్లో ఉండి.. మొన్న కాంగ్రెస్లో చేరడంతోనే ఆయన చైర్మన్ పదవిని ఇప్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎలా ఇస్తారు..? అని.. కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న పూరన్ రెడ్డి పేరును అధిష్టానానికి సూచించినట్టు తెలిసింది. దీంతో ఈ పంచాది ఇప్పుడు సీఎం వద్దకు వచ్చింది. మంత్రి పదవిని అడ్డుకోవడంతో పాటు.. తన అనుచరులకు పదవులు రాకుండా చేస్తున్నారనే కోపం సుదర్శన్రెడ్డికి ఉంది.
ఆయన సీఎం వద్ద ఎంత మొరపెట్టుకున్నా.. అక్కడ మహేశ్ మాటనే చెల్లుబాటు అవుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో పంతం నీదా నాదా సై అన్నట్టుగా సాగుతోంది. మహేశ్ తన వర్గాన్ని అక్కడ పెంచుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఆర్మూర్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాపై పట్టు బిగుస్తున్నారు. సుదర్శన్రెడ్డికి చెక్ పెడుతున్నారు. అంతా తానై నడిపిస్తున్నారు.