South Indian Sambar: సౌత్ ఇండియన్స్ భోజనంలో సాంబార్ లేకపోతే ఆ రోజు పూర్తి కానట్టే. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని, పక్కన ఒక అప్పడం నంజుకుని సాంబార్తో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. కేవలం అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్స్ లోకి కూడా సాంబార్ అద్భుతంగా ఉంటుంది. కూరగాయల ముక్కలు, పప్పు, సాంబార్ పొడి కలయికతో వచ్చే ఆ సువాసన ఇల్లంతా నిండిపోయి ఆకలిని పెంచేస్తుంది. ఒకసారి ఈ పద్ధతిలో సాంబార్ చేసి చూడండి.. ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు.
ఒక కప్పు కందిపప్పు, నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, రెండు మీడియం సైజు టమాటాలు, మునక్కాయలు, సొరకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర. పోపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ.
Also Read: వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్!
మీకు కావాల్సినంత కందిపప్పును శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చింతపండును నానబెట్టి రసం తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువతో పోపు వేయాలి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, క్యారెట్, సొరకాయ, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
తర్వాత ముక్కలు కాస్త మెత్తబడ్డాక చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి మరిగించాలి. చింతపండు పచ్చివాసన పోయాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలపాలి. ఇప్పుడు సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం ముక్క వేసి సాంబార్ను కనీసం పది నిమిషాల పాటు తక్కువ మంటపై మరిగించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ సిద్ధం.
సాంబార్ రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వాడే కందిపప్పు వల్ల ప్రోటీన్లు అందుతాయి. రకరకాల కూరగాయలు కలపడం వల్ల విటమిన్లు, పీచు పదార్థం లభిస్తాయి. చింతపండు, సాంబార్ పొడిలో ఉండే మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది సమతుల్య ఆహారంగా పనిచేస్తూ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
Also Read: ముక్క జ్యూసీగా, గ్రేవీ రుచిగా రావాలంటే చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి!