ACCA Ban Online Exam| ఏఐ టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ నష్టాన్ని చూస్తూ చాలా సంస్థలు భద్రత కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ కోవలో తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ (ACCA) నిలిచింది. యుకె కు చెందిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది సభ్యులు, 5 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ACCA చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెలెన్ బ్రాండ్ ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో విద్యార్థులు చేస్తున్న మోసాలు నియంత్రించడం చాలా కష్టమవుతోందని చెప్పారు. ఆన్లైన్ పరీక్షల్లో నమ్మకం, న్యాయం ఉండటం కష్టమైందని అన్నారు.
మార్చి 2026 నుంచి ACCA పరీక్షలన్నీ ఆఫ్ లైన్ మోడ్ లో సెంటర్లలో వ్యక్తిగతంగా రాయాలి. ఆన్లైన్ పరీక్షలు కేవలం చాలా అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. సెంటర్లలో పరీక్షలు రాస్తే భద్రత బాగుంటుందని, మోసాలు తగ్గుతాయని ACCA భావిస్తోంది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో లాక్డౌన్ల వల్ల ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం కష్టమైంది. అందుకే ACCA ఆన్లైన్ పరీక్షలు ప్రవేశపెట్టింది. రిమోట్ ఇన్విజిలేషన్ సాయంతో విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాసి క్వాలిఫికేషన్ పూర్తి చేశారు. అప్పటి ఎమెర్జెన్సీ లాంటి పరిస్థితుల్లో ఈ పరిష్కారం అందరికీ ఉపయోగపడింది.
ఇప్పుడు AI సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మోసాలు చేసే విధానాలు చాలా అధునాతనంగా మారాయి. పరీక్ష సమయంలో ప్రశ్నల ఫోటోలు తీసి AI చాట్బాట్లో వేసి సమాధానాలు తెచ్చుకోవడం జరుగుతోంది. ఇలాంటి సంఘటనల వల్ల పరీక్షల నమ్మకత్వం ప్రశ్నార్థకమైంది.
ప్రపంచంలోని పెద్ద అకౌంటింగ్ కంపెనీలు PwC, KPMG, Deloitte, EYలు మోసాల కేసుల్లో జరిమానాలు చెల్లించాయి. 2022లో EY అమెరికాలో 100 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించింది. ఇవి సంస్థల అంతర్గత పరీక్షలకు సంబంధించినవి అయినా.. అకౌంటింగ్, ఆడిటింగ్ రంగం మొత్తం ప్రభావితమైంది.
Also Read: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆన్లైన్ పరీక్షలు చాలా మంది విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేవి. దూరంగా ఉండే వారు, గర్భిణులు ఇబ్బంది పడకుండా రాసేవారు. కానీ ACCA పరీక్షల నమ్మకత్వాన్ని ముందుంచి ఈ నిర్ణయం తీసుకుంది.
ACCA తన కోర్సును కూడా అప్డేట్ చేస్తోంది. AI, బ్లాక్చైన్, డేటా సైన్స్ అంశాలు జోడిస్తోంది. భవిష్యత్ అకౌంటెంట్లు నిజ జీవిత పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలని హెలెన్ బ్రాండ్ చెప్పారు.