బహుముఖ ప్రజ్ఞాశాలి శుభాన్షు
41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు.. అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా.. రోదసియానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత.. మళ్లీ ఓ భారత పౌరుడు స్పేస్లోకి వెళ్లడం ఇదే తొలిసారి.
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో 1985లో జన్మించిన శుభాన్షు శుక్లా, 2006 జూన్లో భారత వాయుసేన ఫైటర్ వింగ్లో చేరారు. ఎస్యు-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 వంటి అనేక రకాల యుద్ధ విమానాలను.. సుమారు 2000 గంటలకు పైగా నడిపి.. అపార అనుభవం గడించారు. 2024 నాటికి ఆయన గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్లో ఎన్నో పురస్కారాలు, పతకాలు అందుకున్న శుక్లాకు 2019లో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. అనంతరం రష్యాలోని మాస్కోలో ఉన్న యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో వ్యోమగామిగా ప్రత్యేక శిక్షణ పొందారు.
యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న యాక్సియమ్-4 మిషన్లో భాగంగా.. శుక్లా రోదసీలోకి వెళ్తున్నారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. శుభాన్షు అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది.
ఈ మిషన్కు శుక్స్ పైలట్గా వ్యవహరిస్తారు. ఈ ప్రయోగం.. భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైల్ స్టోన్గా నిలవనుంది. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు.. ఈ యాత్ర కీలకమైన అనుభవాన్ని అందిస్తుంది. యాక్సియమ్-4 మిషన్లో.. జీరో గ్రావిటీ వాతావరణంలో.. మెంతి, పెసర మొలకల్ని పెంచే ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల్లో ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలకు సహాయపడనుంది. ఇక.. యోగాసనాలను ప్రదర్శించి.. వాటి ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇది.. వ్యోమగాముల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందనేది అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది.
Also Read: మంచు ఫలకల కింద మరో ప్రపంచం.. ఇది సంచలన ప్రయోగం
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్లా ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్నారు. తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జ్ఞాపకంగా.. ఆయనకు సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని కూడా తనతో పాటు రోదసీలోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత.. భారత ప్రధాని నరేంద్రమోడీతో.. వ్యోమగాములు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా.. స్కూల్ విద్యార్థులు, విద్యావేత్తలు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితోనూ ఆన్ లైన్ ద్వారా ముచ్చటించే అవకాశం ఉంది. ఈ మిషన్ ద్వారా.. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు.. శుభాన్షు శుక్లా యాత్ర ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు.