A Sreekar Prasad on AI in Cinema:టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్నా సరే… సినిమాకు అసలైన బలం మాత్రం మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ మాత్రమేనని ప్రముఖ సీనియర్ ఎడిటర్, తొమ్మిది సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఏ శ్రీకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్లోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ప్రత్యేక మాస్టర్క్లాస్లో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎడిటింగ్ ప్రాధాన్యత, మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమలో AI పాత్రపై ఆయన పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి.
సినిమా రంగంలో ఎడిటర్ పాత్ర కేవలం కొన్ని సీన్లను ఒకదానికొకటి అతికించడం మాత్రమే కాదని, ఒక పాత్ర ఆత్మను, కథనంలో ప్రవాహాన్ని, ప్రేక్షకుడు పొందే అనుభూతిని డిజైన్ చేసేది ఎడిటరేనని ఆయన పేర్కొన్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదని, కథ వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టుకోవడం ఎడిటర్కు అత్యంత ముఖ్యమని శ్రీకర్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ మరియు AI వంటి ఆధునిక సాంకేతికతలు సినిమా నిర్మాణ విధానాన్నే మార్చేస్తున్నాయని అంగీకరించారు.
also read :బిగ్బాస్ 10లోకి హాట్ బ్యూటీ.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్.?
అయితే, టెక్నాలజీ ఎంత పెరిగినా క్రియేటివ్ థింకింగ్ ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గదని, పైగా మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. AI అనేది ఒక సీన్ను సాంకేతికంగా పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేయగలదేమో కానీ, సినిమాకు కావలసిన అసలైన బలం మాత్రం హ్యూమన్ ఎమోషన్స్, వారి అంతర్ దృష్టి (Intuition) మరియు లోపాలతో కూడిన సహజత్వం నుంచే వస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రీ-విజువలైజేషన్, ముఖ్యంగా 3D విజువలైజేషన్ యొక్క ప్రాముఖ్యతను శ్రీకర్ ప్రసాద్ హైలైట్ చేశారు. షూటింగ్ ప్రారంభించడానికి ముందే దర్శకుడు, ఎడిటర్ కలిసి కథను స్క్రీన్ మీద ఎలా తీసుకురావాలో ప్లాన్ చేసుకోవడానికి ఈ టూల్స్ ఎంతో ఉపయోగపడతాయి. దీనివల్ల అనవసరమైన ఖర్చు, సమయం వృధా కాకుండా చూసుకోవచ్చని ఆయన తెలిపారు. భవిష్యత్ ఎడిటర్లు కేవలం సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కే పరిమితం కాకుండా, AI జనరేటెడ్ కంటెంట్ను ఎలా వాడుకోవాలి, విజువల్స్ ఎలా డిజైన్ చేయాలి మరియు ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ను ఎలా నడిపించాలనే విషయాలపై ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకోవాల్సి ఉంటుందని సూచించారు.
సినిమా రంగానికి రావాలనుకునే నేటి తరం యువత చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా గమనించాలని, సినిమా పేసింగ్, రిథమ్ మరియు షాట్ డ్యూరేషన్ వంటి విషయాలపై పట్టు సాధించాలని శ్రీకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రయోగాలు చేయడానికి భయపడకూడదని, మనం నమ్మిన కథపై మనకు బలమైన నమ్మకం (Conviction) ఉండాలని స్పష్టం చేశారు. అలాగే, ఒక ప్రాజెక్ట్పై భారీగా సమయాన్ని, పెట్టుబడిని పెట్టే ముందు ఆడియన్స్ రీసెర్చ్ చేయడం కూడా చాలా ముఖ్యం.
also read :సాక్షి శివానంద్కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?
ప్రేక్షకుల టేస్ట్ను అర్థం చేసుకోవడం వల్ల అటు క్రియేటివ్ పరంగా, ఇటు బిజినెస్ పరంగా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని శ్రీకర్ ప్రసాద్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. టెక్నాలజీ కేవలం ఒక సాధనం మాత్రమేనని, అసలైన సినిమా మాత్రం గుండెల్లోంచి పుడుతుందనే ఆయన మాటలు వర్ధమాన దర్శకులను, ఎడిటర్లను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.
టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో, శ్రీకర్ ప్రసాద్ వంటి దిగ్గజాల అనుభవాలు ఎంతో విలువైనవనే చెప్పాలి. గతేడాది విడుదలైన ప్రభాస్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాల్లో అత్యాధునిక టెక్నాలజీ, ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ అయ్యాయో మనం చూశాం. రాబోయే రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న అల్లు అర్జున్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రాకా ‘మరియు మహేష్ జక్కన్న కాంబోలో వస్తున్న వారణాసి సినిమాల్లో కూడా టెక్నాలజీతో పాటు పక్కా హ్యూమన్ ఎమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
also read :హోటల్ రూమ్ ఖాళీ చేస్తూ విరుష్క ఏం వదిలి వెళ్లారంటే? బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్!