Instagram Plus Premium: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రకటించింది. ‘ఇన్స్టాగ్రామ్ ప్లస్ ప్రీమియం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పెయిడ్ సర్వీస్ ద్వారా యూజర్లు తమ ఖాతాలను మరింత వినూత్నంగా మార్చుకోవచ్చు. అయితే, సాధారణ ఇన్స్టాగ్రామ్ యాప్ ఎప్పటిలాగే అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అదనపు ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ కొత్త ప్లాన్ను తీసుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ధరను కంపెనీ నెలకు దాదాపుగా రూ.330గా నిర్ణయించింది.
క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాపార సంస్థలతో పాటు సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ ఈ సరికొత్త ప్లాన్ను రూపొందించింది. నెలకు దాదాపు రూ.330 చెల్లించి ఈ ప్రీమియం ప్లాన్ తీసుకునే వారికి తమ ఫాలోవర్లతో కనెక్ట్ అవ్వడానికి, కంటెంట్ను షేర్ చేయడానికి మరిన్ని అధునాతన ఆప్షన్లు లభిస్తాయి. ముఖ్యంగా తమ సోషల్ మీడియా అకౌంట్పై పూర్తి నియంత్రణ కోరుకునే వారికి ఈ సరికొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
Also Read: ఇంత తక్కువ ధరకి ఇలాంటి ఫీచర్లా.. సూపర్ లుకింగ్ డిజైన్.. బిగ్ బ్యాటరీతో Vivo Y31s 5G లాంచ్!
ఈ కొత్త ప్రీమియం ప్లాన్లో ‘స్టోరీ స్పాట్లైట్’ అనే సరికొత్త ఫీచర్ను పరిచయం చేశారు. దీనివల్ల మనం పెట్టే స్టోరీలు మన స్నేహితుల ఫీడ్లో అందరికంటే ముందే కనిపిస్తాయి. అంతేకాకుండా.. మనం పెట్టే స్టోరీలు ఎవరెవరు చూడాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు. దీనికోసం మల్టిపుల్ ఆడియన్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీనివల్ల కుటుంబ సభ్యులకు, ఆఫీస్ స్నేహితులకు విడివిడిగా స్టోరీలను షేర్ చేసుకునే వీలుంటుంది.
సాధారణంగా ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టే స్టోరీలు కేవలం 24 గంటలు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఈ ప్లస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రం ఆ సమయాన్ని రెట్టింపు చేశారు. దీంతో ప్రీమియం యూజర్లు పెట్టే స్టోరీలు ఏకంగా 48 గంటల పాటు లైవ్లో ఉంటాయి. దీంతో పాటు చాటింగ్ను మరింత సరదాగా మార్చడానికి ‘సూపర హార్ట్స్’ అనే కొత్త ఎమోజీ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. దీనితో రియాక్ట్ అయినప్పుడు స్క్రీన్పై ఒక చక్కటి యానిమేషన్ కనిపిస్తుంది.
ఈ సరికొత్త Instagram Plus Premium సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చారు. కేవలం అదనపు అనుభూతిని, సరికొత్త ఫీచర్లను కోరుకునే వారి కోసం మాత్రమే నెలకు దాదాపు రూ.330 ధరతో ఈ పెయిడ్ సర్వీస్ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. సాధారణ ఫీచర్లతో సంతృప్తి చెండే వారు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఎప్పటిలాగే ఉచితంగా ఇన్స్టాగ్రామ్ యాప్ను వాడుకోవచ్చు.
Also Read: షియోమీ షాకింగ్ నిర్ణయం.. ఒకేసారి Redmi K100, Xiaomi 18 సిరీస్ లాంచ్?!