Apple : టెక్ దిగ్గజం యాపిల్ (Apple) వ్యక్తిగత భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ చెప్పుకొస్తూనే.. తాజాగా యాపిల్ ఐఫోన్ వినియోగదారులపై నిఘా వేసినందుకు భారీగా పరిహారం చెల్లించటానికి ముందుకు వచ్చింది. యాపిల్ సంస్థకు చెందిన వర్చువల్ అసిస్టెంట్ సిరి (Apple Siri) ఐఫోన్ తో పాటు ఇతర గ్యాడ్జెట్స్ వినియోగదారుల సంభాషణలు వింటుంది అనే ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో వాటిని సెటిల్ చేసుకునేందుకు భారీ పరిహారాన్ని చెల్లించడానికి ఆ సంస్థ అంగీకరించింది.
యాపిల్ సంస్థకు చెందిన వర్చువల్ అసిస్టెంట్ సిరి ఐఫోన్ తో పాటు ఇతర యాపిల్ గ్యాడ్జెట్స్ వినియోగదారుల సంభాషణలు రహస్యంగా వింటుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యూజర్స్ సంభాషణలు వినేందుకు సిరిని రహస్యంగా యాక్టివేట్ చేసినట్టు ఐదేళ్ల క్రితం వాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై సెటిల్మెంట్ చేసుకునేందుకు యాపిల్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యాపిల్ 95 మిలియన్ డాలర్లు (రూ.814 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమైంది.
వర్చువల్ అసిస్టెంట్ ను యాక్టివేట్ చేసే కీలకమైన ఇన్ట్రక్షన్స్ ‘హే సిరి’ వంటివి వినియోగదారులు చెప్పకపోయినా ఆటోమెటిగ్గా యాక్టివేట్ అయ్యి మాటలు రికార్డు చేసిందని ఈ వాజ్యంలో ఆరోపించారు. అయితే ఈ సంభాషణలను రహస్యంగా వాణిజ్య ప్రకటనలు జారీ చేసే వారికి షేర్ చేసేదని.. దీంతో వారు వారి ప్రోడక్ట్స్ ను తేలికగా విక్రయించే వారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక ఈ సెటిల్మెంట్ నేపథ్యంలో యాపిల్ తప్పు చేసినట్టు ఎక్కడా అంగీకరించకపోయినప్పటికీ భారీ మూల్యాన్ని చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీనిపై విచారణ ఫిబ్రవరి 14వ తేదీన జరగనుంది. ఇక ఈ సెటిల్మెంట్ ఆమోదం పొందితే 2014 సెప్టెంబర్ 17 నుంచి యాపిల్ ఐఫోన్లు వాడుతున్న లక్షలాది యూజర్స్ క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ప్రతీ వినియోగదారుడు అత్యధికంగా 20 డాలర్ల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. క్లెయిమ్ ఆధారంగా చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది లేదా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అయితే మెుత్తం వినియోగదారుల్లో మూడు నుంచి ఐదు శాతం వినియోగదారులు మాత్రమే క్లెయిమ్ చేసుకుని అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక్కొక్కరు కేవలం 5 డివైజెస్ కు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు.
ALSO READ : ఫ్రీగా యాపిల్ ఒరిజినల్ కంటెంట్ చూసే ఛాన్స్… డోంట్ మిస్ ఇట్!
లక్షల కోట్ల ఆదాయం –
యాపిల్ కంపెనీ ఇన్నేళ్లలో లక్షల కోట్ల లాభం పొందింది. 2014 నుంచి యాపిల్ సంస్థ సంపాదించిన 705 బిలియన్ డాలర్ల (రూ.60 లక్షల కోట్లు) పోలిస్తే ఈ పరిహారం చాలా తక్కువని వాదనలు సైతం వినిపిస్తున్నాయి. అందుకే యాపిల్ పరిహారంగా 1.5 బిలియన్ డాలర్లు (రూ.12వేల కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వినియోగదారుల గోప్యతకు చెందిన విషయమని.. ఈ విషయంలో యాపిల్ యూజర్స్ ను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఇక యాపిల్ సంస్థ తన ప్రతీ ఈవెంట్ లో వినియోగదారుల భద్రతే లక్ష్యంగా గ్యాడ్జెట్స్ ను తీసుకొస్తున్నామని తెలుపుతుంది. అంతేకాకుండా మరిన్ని అధునాతన ఫీచర్స్ తో కొత్త గ్యాడ్జెట్స్ ను తీసుకొస్తామని హామీ ఇస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఇలా యాపిల్ సంస్థ నుంచే సమస్య ఎదురుకావటం యూజర్స్ ను షాక్ కు గురి చేసింది.