ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు సోషల్ మీడియాలను చూస్తున్నారు. అయితే, ఏ ప్లాట్ ఫారమ్ ఓపెన్ చేసినా, బోలెడు సమాచారం కనిపిస్తుంది. ఇందులో ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేకపోతున్నారు వినియోగదారులు. సోషల్ మీడియా నుంచి డబ్బులు సంపాదించుకునేందుకు కంటెంట్ క్రియేటర్లు తెలిసీ తెలియని విషయాలను నిజమే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. వీరిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. కానీ, డ్రాగన్ కంట్రీ చైనా ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. కంటెంట్ క్రియేటర్స్ కు చెప్పే విషయాలకు సంబంధించి ఆయా సబ్జెక్ట్ లో డిగ్రీ ఉండాలని వెల్లడించింది. అవేమీ లేకుండా అడ్డగోలుగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తామనంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై సున్నితమైన విషయాలను ప్రస్తావించే ఇన్ ఫ్లుయెన్సర్లు తప్పకుండా వృత్తిపరమైన అర్హత కలిగి ఉండాలనే చట్టాన్ని తీసుకొచ్చింది. తప్పుడు విషయాలు, తప్పుడు సలహాలతో ప్రజలను తప్పుదోవ పట్టించకుండా అడ్డుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, లా, ఫైనాన్స్ కు సంబంధించి విషయాల గురించి సోషల్ మీడియాలో కంటెంట్ షేర్ చేయాలంటే, దానికి సంబంధించిన డిగ్రీ, లైసెన్స్, సర్టిఫికేషన్ లాంటి అధికారిక పత్రాలను సూచించాల్సి ఉంటుంది.
ఈ నెల 25 నుంచి ఈ కొత్త నిబంధనలు చైనాలో అమల్లోకి వచ్చాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే సలహాల నుంచి కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ నిబంధనల అమలు బాధ్యతను టిక్ టాక్ చైనా వెర్షన్ అయిన డౌయిన్, వీబో లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లకు అప్పగించింది. క్రియేటర్ల అర్హతలను, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత ఈ సంస్థలదేనని తేల్చి చెప్పింది. మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను ఎడ్యుకేషన్ పేరుతో ప్రమోట్ చేయడాన్ని చైనా సర్కారు నిషేధించింది.
Read Also: సామ్ సంగ్ నుంచి నయా బ్రౌజర్.. సేఫ్టీకి ఇక తిరుగుండదు!
చైనా తాజాగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. అర్హత లేకున్నా ఆయా అంశాల గురించి వీడియోలను షేర్ చేస్తే, వారి అకౌంట్లను నిలిపివేయడంతో పాటు పర్మినెంట్ గా నిషేధించే అవకాశం ఉంది. అదే సమయంలో 100,000 యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ. 11 లక్షల వరకు జరిమానా విధిస్తుంది. చైనా తీసుకొచ్చిన ఈ నింబంధనల పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుంది. కొంత మంది భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డంకి అని వాదిస్తున్నా, తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు తప్పదనే వాదన వినిస్తుంది. ఇలాంటి నిబంధనలు ఇండియాలోనూ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
Read Also: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?