Phone Charger: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని మనిషి, ఇల్లు లేదంటే ఎలాంటి అతిశయోక్తి ఉండదు. మెుబైల్స్ తో పాటు ఛార్జర్లు సైతం.. నిత్య జీవితంపై భాగమైపోయాయి. అయితే ఛార్జర్ల విషయంలో చాలా మందికి ఓ అలవాటు ఉంటుంది. ఫోన్ చార్జింగ్ అయిపోగానే ఫోన్ తీసేస్తారు కానీ చార్జర్ను మాత్రం సాకెట్ (Plugs) లోనే అలాగే వదిలేస్తుంటారు. కనీసం స్విచ్ కూడా ఆఫ్ చేయరు. మరి ఇలా చార్జర్ను 24 గంటలూ ప్లగ్లోనే ఉంచడం వల్ల ఏమైనా ప్రమాదమా? లేదా బిల్లు ఎక్కువగా వస్తుందా? దీనిపై టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో చూద్దాం.
ఫోన్ ను ఛార్జర్ కు కనెక్ట్ చేసినా, చేయకపోయినా స్విచ్ ఆన్ చేసి ఉన్న చార్జర్.. కొద్ది మొత్తంలో విద్యుత్ను వినియోగిస్తూనే ఉంటుంది. దీనినే టెక్నికల్ భాషలో ‘ఫాంటమ్ లోడ్’ లేదా ‘వ్యాంపైర్ డ్రా’ (Vampire Draw) అంటారు. చార్జర్ లోపల ఉండే ట్రాన్స్ఫార్మర్, ఫోన్ లేకపోయినా కరెంట్ను చిన్న మొత్తంలో వాడుకుంటూనే ఉంటాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చార్జర్ను అలా వదిలేయడం వల్ల కొద్దిమేర పవర్ బిల్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే అది నామమాత్రంగానే ఉంటుంది. ఒక చార్జర్ నెల మొత్తం ప్లగ్లోనే ఉంటే.. అది కొన్ని పైసలు లేదా మహా అయితే ఒకటి రెండు రూపాయల ఖర్చును మాత్రమే పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జేబుకు కలిగే పెద్ద నష్టం ఏమీ లేదని పేర్కొంటున్నారు. కానీ ఇంట్లో పదుల సంఖ్యలో చార్జర్లు, టీవీలు, మైక్రోవేవ్లు ఇలాగే ‘స్టాండ్బై’ మోడ్లో ఉంటే మాత్రం ఏడాది చివరన బిల్లులో భారీ మార్పు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఛార్జర్ ను ప్లగ్ కు అలాగే వదిలేయడం వల్ల దాని మన్నిక దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్జర్ ఎప్పుడూ ప్లగ్కు కనెక్ట్ అయి ఉండటం వల్ల అందులోని అంతర్గత భాగాలు (Internal components) నిరంతరం పని చేస్తూనే ఉంటాయని పేర్కొంటున్నారు. దీనివల్ల చార్జర్ త్వరగా వేడెక్కడం, లోపలి భాగాలు అరిగిపోవడం జరిగి చార్జర్ లైఫ్ టైమ్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఒరిజినల్, బ్రాండెడ్ చార్జర్లలో సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి కాబట్టి అంత త్వరగా ప్రమాదాలు జరగవు. ఒకవేళ నాసిరకం లేదా లోకల్ చార్జర్లు వాడుతుంటే అవి ఓవర్హీట్ అయి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి పవర్ సప్లైలో అకస్మాత్తుగా వోల్టేజ్ పెరిగినప్పుడు ప్లగ్లోనే ఉన్న చార్జర్ కాలిపోవడమే కాకుండా పక్కన ఉన్న వస్తువులకు నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు బెడ్ పైనో, సోఫా పైనో చార్జర్ ఉంచి దానిపై బట్టలు లేదా దిండ్లు పెడితే వేడి బయటకు పోక ప్రమాదాలు జరిగే ముప్పు సైతం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read: ఏసీ గదిలో స్టాండ్ ఫ్యాన్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. నిజంగా ఆశ్చర్యపోతారు!
ఇంట్లో చిన్న పిల్లలు లేదా కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాకెట్లో ఉన్న చార్జర్ వైర్ కొసను పిల్లలు నోట్లో పెట్టుకున్నా లేదా జంతువులు కొరికినా వైర్లలో ఉండే విద్యుత్ వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెుత్తంగా చూస్తే.. చార్జర్ను ప్లగ్లోనే ఉంచడం వల్ల పెద్దగా కరెంటు బిల్లు పెరగపోయినా.. భద్రతా పరంగా మాత్రం రిస్క్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చార్జింగ్ కాగానే స్విచ్ ఆఫ్ చేయడం లేదా చార్జర్ను పక్కన పెట్టడం చాలా మంచి అలవాటని స్పష్ట చేస్తున్నారు.
Also Read: BSNL కస్టమర్లకు షాక్.. రూ. 107 ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ కట్!