BSNL SIM Fraud: టెలికాం ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా సైబర్ నేరాలు జరిగితే బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తూ కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కస్టమర్ అనుమతి లేకుండా డూప్లికేట్ సిమ్ కార్డ్ జారీ చేయడం, దాని ద్వారా ఓటీపీలను (OTPs) యాక్సెస్ చేసి రూ.87 లక్షల బ్యాంకు మోసానికి పాల్పడిన కేసులో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)కు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. నష్టపోయిన సహకార బ్యాంకుకు వెంటనే రూ. 55 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
2019లో ‘శ్రీ బసవేశ్వర పట్టణ సహకార బ్యాంక్ నియమిత’ బ్యాంకును డూప్లికేట్ సిమ్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఆ ఏడాది ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ ల ద్వారా ఏడు సార్లు అనధికారిక లావాదేవీలు జరిపి ఏకంగా రూ.87.7 లక్షలను డ్రా చేశారు. అయితే దీనిపై సహకార బ్యాంక్ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. బెంగళూరులోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు లింకైన బ్యాంక్ అధికారిక నంబర్ కు డూప్లికేట్ సిమ్ కార్డును సైబర్ నేరస్థులు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దొంగలు డూప్లికేట్ సిమ్ ను యాక్టివేట్ చేసుకోగానే.. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలన్నీ ఆ నెంబర్ కే వెళ్లినట్లు గుర్తించారు.
అయితే డూప్లికేట్ సిమ్ కోసం తాము బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఎలాంటి అప్లికేషన్ పెట్టలేదని సహకార బ్యాంక్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సరైన గుర్తింపు పత్రాలను పరిశీలించకుండానే.. నిందితులకు బీఎస్ఎన్ఎల్ డూప్లికేట్ సిమ్ కార్డును జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ సిమ్ కార్డును ఉపయోగించే.. నిందితులు సహకార బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు దోచుకెళ్లేందుకు వీలైందని తేలింది. అయితే పోలీసులు వివిధ మార్గాల్లో రూ.37 లక్షలను తిరిగి బ్యాంక్ అధికారులకు అప్పజెప్పగా.. మిగిలిన నష్టం రూ.50.50 లక్షల కోసం సహకార బ్యాంక్ అధికారులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
బీఎస్ఎన్ఎల్ నిర్లక్ష్యం వల్లే తాము డబ్బును పోగొట్టుకున్నామని సహకార బ్యాంక్ పిటిషన్ లో పేర్కొంది. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించి బీఎస్ఎన్ఎల్ సిబ్బంది డూప్లికేట్ సిమ్ జారీ చేయడంతో ఈ భారీ మోసం జరిగిందని కోర్టులో వాదించింది. టెలికాం సంస్థ నిర్లక్ష్యం వల్లే తాము ఆర్థికంగా నష్టపోయామని, అందుకు పరిహారం ఇప్పించాలని కోర్టుకు విన్నవించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జడ్జి జస్టిస్ సూరజ్ గోవింద రాజ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కస్టమర్ కు కాకుండా నకిలీ వ్యక్తులకు డూప్లికేట్ సిమ్ వెళ్లిందంటేనే అక్కడ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదని తేలిపోయిందని న్యాయమూర్తి అన్నారు. ఈ తప్పుకు బీఎస్ఎన్ఎల్ సంస్థే పూర్తి బాధ్యత వహించాలని తీర్పు వెలువరించింది. రూ. 50.50 లక్షల అసలు పరిహారంతో పాటు రూ.5 లక్షలు అదనపు జరిమానా బాధిత బ్యాంక్ కు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
Also Read: Bharti Fulmali: టీమిండియాలో ట్రాన్స్ జెండర్…భారతి ఫుల్మాలిపై దారుణంగా ట్రోల్స్
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు.. దేశంలోని మిగతా టెలికాం కంపెనీలకు ఒక హెచ్చరికగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా సైబర్ మోసాలు జరిగినప్పుడు బ్యాంకులు లేదా వినియోగదారులదే తప్పు అనే ధోరణి ఉంటుంది. కానీ సిమ్ కార్డ్ జారీ ప్రక్రియలో టెలికాం సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటి నుండి కూడా పరిహారం వసూలు చేయవచ్చని ఈ తీర్పు నిరూపించింది. సైబర్ నేరాలకు సంబంధించి.. ఒక టెలికాం సంస్థను బాధ్యుడ్ని చేయడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అని, ఇలాంటి తీర్పు గతంలో ఎన్నడూ రాలేదని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read:సూపర్ మ్యాన్ థీమ్ తో స్టడ్స్ కొత్త హెల్మెట్.. ఐదు కలర్ ఆప్షన్లతో లాంచ్!